చెన్నై: తమిళనాడు మాజీ సీఎం జయలలితపై ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అన్నాడీఎంకే(AIADMK) పార్టీ ఇవాళ తీర్మానం చేసింది. అన్నామలై వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నట్లు ఆ తీర్మానంలో పేర్కొన్నారు. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ ఎడప్పాడి కే పళనిస్వామి దీనిపై ప్రకటన చేశారు. తమ పార్టీకి చెందిన దివంగత నేత జయలలితపై అన్నామలై అనుచిత వ్యాఖ్యలు చేశారని, దాన్ని ఖండిస్తూ తీర్మానం చేశామని, అన్నామలై వ్యాఖ్యలతో తమ పార్టీ నేతలు బాధపడుతున్నారని పళనిస్వామి అన్నారు.
ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన బీజేపీ చీఫ్ అన్నామలై.. ఆ ఇంటర్వ్యూలో గత పాలకుల తీరును విమర్శించారు. రాష్ట్రంలో అన్ని శాఖల్లో అవినీతి పెరిగిపోయిందని, మాజీ సీఎంలు కూడా అవినీతి కేసుల్లో దోషులుగా తేలారని, దాని వల్ల దేశంలో తమిళనాడు రాష్ట్రం అవినీతి రాష్ట్రంగా నిలిచిందని అన్నామలై ఆరోపించారు. ఆ ఆరోపణలను అన్నాడీఎంకే పార్టీ ఖండించింది. బీజేపీ సీనియర్ నేతలతో తమ నేత జయలలితకు మంచి సంబంధాలు ఉండేవని అన్నాడీఎంకే తన తీర్మానంలో పేర్కొన్నది. 1998లో బీజేపీ అధికారంలోకి రావడానికి జయ మద్దతు ఇచ్చినట్లు పళనిస్వామి తెలిపారు.