Mumtaz Patel | లోక్సభ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు ఖరారైంది. రెండు పార్టీలు కూడా సీట్ల పంపకంపై అధికారికంగా ప్రకటన చేశాయి. పార్టీలో పలువురు నేతలు పొత్తుల్లో సీట్లపై స్పందిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ కుమార్తె, కాంగ్రెస్ నాయకురాలు ముంతాజ్ పటేల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అహ్మద్ పటేల్ 45 ఏళ్ల వారసత్వాన్ని వృథా చేయనివ్వబోమన్నారు. గుజరాత్లో కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తులో భాగంగా కాంగ్రెస్ 24 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నది.
ఆమ్ ఆద్మీ పార్టీకి భరూచ్, భావ్నగర్ రెండు స్థానాలను కేటాయించారు. భరూచ్ లోక్సభ స్థానాన్ని కాపాడుకోలేకపోయినందుకు జిల్లా కేడర్కు క్షమాపణలు చెబుతున్నామన్నారు. తమ అసంతృప్తిని అధిష్ఠానికి తెలియజేస్తామన్నారు. అహ్మద్ పటేల్ తనయుడు ఫైజల్ పటేల్ స్పందిస్తూ భరూచ్ సీటును ఆప్కి ఇస్తే మద్దతివ్వబోమని ఇటీవల హెచ్చరించారు. తాజాగా స్పందిస్తూ పార్టీ కార్యకర్తలు, తాము పార్టీ నిర్ణయంపై సంతోషంగా లేమన్నారు. ఈ నిర్ణయం తీసుకోకూడద కోరుకున్నామన్నారు. దీనిపై మరోసారి పార్టీ హైకమాండ్తో మాట్లాడుతామన్నారు.
ఎన్నికలకు, నామినేషన్లకు ఇంకా చాలా సమయం ఉందని.. గాంధీ కుటుంబం నా కుటుంబమేనని.. ఈ సీటు విషయంలో పటేల్ కుటుంబీకుల మనోభావాలను అర్థం చేసుకుంటారని నమ్ముతున్నానన్నారు. దివంగత కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్ భరూచ్ లోక్సభ స్థానం నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ చివరిసారిగా 1984లో ఈ సీటును గెలుచుకుంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో అహ్మద్ పటేల్ కుమార్తె ముంతాజ్ పటేల్ భరూచ్ నుంచి పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. పొత్తులో భాగంగా భరూచ్ సీటు ఆప్ ఖాతాలోకి వెళ్లడంపై ముంతాజ్ పటేల్, ఫైజల్ పటేల్ అసంతృప్తి వ్యక్తం చేయడానికి ఇదే కారణం.