న్యూఢిల్లీ/ముంబై, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికలకు ముందు ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అజిత్ పవార్ వర్గమే అసలైన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ పార్టీ ఎన్నికల గుర్తు ‘గడియారం’ను కూడా అజిత్ వర్గానికే కేటాయిస్తూ ఈసీ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో గత కొన్ని నెలలుగా అసలైన ఎన్సీపీ ఎవరిదనే విషయంలో శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాల మధ్య కొనసాగుతున్న కుమ్ములాటలకు ఎన్నికల సంఘం తెరదించినట్టు అయింది. తనదే అసలైన ఎన్సీపీ అంటూ అజిత పవార్ దాఖలుచేసిన పిటిషన్పై గత ఆరు నెలల్లో 10 సార్లు విచారణ జరిపిన ఈసీ ఈ మేరకు తన తాజా నిర్ణయాన్ని ప్రకటించింది. ఎన్నికల కమిషనర్గా అనుప్ చంద్ర పాండే కొద్ది రోజుల్లో పదవీ విరమణ పొందునున్న నేపథ్యంలో తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకొన్నది.
అజత్ పవార్ వర్గమే అసలైన ఎన్సీపీ అని ప్రకటించిన ఈసీ.. ఈ నెలాఖరులో జరుగనున్న రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని శరద్ పవార్కు ప్రత్యామ్నాయ అవకాశం కల్పించింది. తన వర్గానికి పార్టీ పేరు, ఎన్నికల గుర్తును ఎంచుకొనేందుకు అవకాశం ఇచ్చింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం 3 గంటలలోగా మూడు ప్రతిపాదనలు పంపాలని సూచించింది.
గత ఏడాది జూలైలో ఎన్సీపీలోని మెజార్టీ ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ వేరు కుంపటి పట్టిన విషయం తెలిసిందే. బీజేపీ-శివసేన(షిండే) ప్రభుత్వంలో చేరిన ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శరద్ పవార్ వర్గం ఫిర్యాదు చేసింది. అయితే అధిక ఎమ్మెల్యేల సంఖ్యా బలం కలిగిన తమ వర్గానిదే అసలైన ఎన్సీపీ అని అజిత్ పవార్ క్లెయిమ్ చేశారు. ఎన్సీపీ చీలికలను గుర్తించిన ఎన్నికల సంఘం ఇరువర్గాలను తగిన పత్రాలు సమర్పించాలని ఆదేశించింది.
ఈసీ నిర్ణయాన్ని శరద్ పవార్ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని, దురదృష్టకరమని మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్ అన్నారు. ‘పై నుంచి ఒత్తిళ్ల’తో ఎన్నికల సంఘం ఈ ఉత్తర్వులు జారీచేసిందని ఆరోపించారు. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 48 గంటల్లో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని పార్టీ నేత సుప్రియా సూలే పేర్కొన్నారు.
ఎన్సీపీ పార్టీ పేరు, ఎన్నికల గుర్తును తమ వర్గానికి కేటాయిస్తూ ఈసీ తీసుకొన్న నిర్ణయాన్ని వినయంతో స్వాగతిస్తున్నానని అజిత్ పవార్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తల్లో మెజార్టీ అజిత్ పవార్ వైపు ఉన్నారనే విషయాన్ని ఈసీ తీర్పు నిరూపించిందని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ అన్నారు.