న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఉత్తరప్రదేశ్లో పొత్తుల కోలాహలం మొదలైంది. మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాది పార్టీ (SP), ఓం ప్రకాష్ రాజ్భర్ నేతృత్వంలోని సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) మధ్య పొత్తు కుదిరింది. ఇవాళ ఢిల్లీలో అఖిలేష్ యాదవ్, ఓం ప్రకాష్ రాజ్భర్ సమావేశమై రెండు పార్టీల మధ్య పొత్తు కుదుర్చుకున్నారు.
ఈ విషయాన్ని అఖిలేష్ యాదవ్ మీడియాకు వెల్లడించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో SP, SBSP కలిసి పోటీచేస్తాయని ఆయన తెలిపారు. బీజేపీ పాలనలో వంచనకు గురైనవారు, హింసను అనుభవించినవారు, వెనుకబడిన తరగతులు, దళితులు, మహిళలు, రైతులు, యువత, బడుగు బలహీన వర్గాలతో కలిసి.. యోగీ ఆదిత్యనాథ్ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా తాము ఈ ఎన్నికల్లో పోరాడుతామని అఖిలేష్ యాదవ్ చెప్పారు.
అనంతరం ఓం ప్రకాష్ రాజ్భర్ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతాపార్టీని గద్దె దించడమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో SP, SBSP కలిసి పోటీ చేయబోతున్నాయని వ్యాఖ్యానించారు. ఇటీవల అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద పార్టీలతో పొత్తులు ఉండవని ప్రకటించారు. పెద్ద పార్టీలతో పొత్తులు ఎప్పుడూ అంతగా కలిసిరాలేదని చెప్పారు. కలిసి వచ్చే చిన్న పార్టీలతో మాత్రం పొత్తులు పెట్టుకుంటామన్నారు. అన్నట్టే ఇప్పుడు SBSPతో పొత్తు కుదుర్చుకున్నారు.