న్యూఢిల్లీ: అద్దె ఇంట్లో నివసిస్తున్న ఒక మహిళ అనుమానాస్పదంగా మరణించింది. అయితే ఆమెతో కలిసి సహజీవనం చేస్తున్న వ్యక్తి అదృశ్యమయ్యాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు చెందిన 36 ఏళ్ల మహిళ, ఆగ్రాకు చెందిన వ్యక్తితో కలిసి గత కొన్ని రోజులుగా రోహిణి ప్రాంతంలోని ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఇంటి యజమాని వారి గదికి వచ్చి చూశాడు. ఇంటి తలుపులు కాస్త తెరిచి ఉండగా ఆ మహిళ అచేతనంగా పడి ఉన్నది. దీంతో ఇంటి ఓనర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడకు వచ్చి మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించలేదని తెలిపారు. పోస్ట్మార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.
కాగా, ఆ మహిళతో కలిసి సహజీవనం చేస్తున్న వ్యక్తి అదృశ్యమయ్యాడు. అతడి మొబైల్ ఫోన్ కూడా స్విచ్ఆఫ్లో ఉంది. ఈ నేపథ్యంలో పంజాబ్లో పని చేస్తున్న మహిళ భర్తను పోలీసులు సంప్రదించారు. 2011లో తమకు పెళ్లి అయ్యిందని, ఒక కుమారుడు, ఇద్దరు కూమార్తెలు సంతానమని అతడు తెలిపాడు. నవంబర్ 24న భార్య పంజాబ్కు వచ్చిందని, అనంతరం మూడు రోజులకు చికిత్స కోసం ఢిల్లీ వెళ్లిందని చెప్పాడు. ఆమెకు మరో వ్యక్తితో చాలా కాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు భర్త అనుమానం వ్యక్తం చేశాడు.
మరోవైపు మహిళ మృతిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సహజీవనం చేస్తున్న వ్యక్తిని అనుమానిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు చెందిన ఆ వ్యక్తి కోసం వెతుకున్నారు. ఆ వ్యక్తిపై వరకట్న మరణంతోపాటు మరో కేసు కూడా యూపీలో నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.