న్యూఢిల్లీ : భారత త్రివిధ దళాల్లోకి రెగ్యులర్ నియామకాలను రద్దుచేస్తూ.. నాలుగేళ్ల కాంట్రాక్టు పద్ధతిలో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చేలా కేంద్రం కొత్తగా ‘అగ్నిపథ్’ స్కీమ్ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసన తెలిపిన ఆర్మీ అభ్యర్థులు.. తాజాగా సోమవారం భారత్ బంద్కు పిలుపునిచ్చారు. అగ్నిపథ్ స్కీమ్ను వెంటనే కేంద్రం వెనక్కి తీసుకోవాలని, ఆర్మీలో ఉద్యోగాల భర్తీని చేపట్టాలనే డిమాండ్తో బంద్కు పిలుపునిచ్చారు. అయితే, బంద్కు అనుమతి లేదని కేంద్రం, ఆయా రాష్ట్రాల పోలీసులు ప్రకటించారు.
బంద్ పేరిట నిరసన కార్యక్రమాలకు దిగితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో రైల్వేస్టేషన్లలో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. రైళ్లను తగులబెట్టడంతో పాటు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన నేపథ్యంలో బలగాలు బంద్ను సవాల్గా తీసుకుంటున్నాయి. ఈ మేరకు దేశవ్యాప్తంగా రైల్వేల్లో హైఅలర్ట్ కొనసాగుతుండగా.. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉన్నది. ఇదిలా ఉండగా భారత్ బంద్ పిలుపు నేపథ్యంలో జార్ఖండ్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని సోమవారం ప్రభుత్వం ఆదేశించింది.
బిహార్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించింది. అదే సమయంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే, హింసకు పాల్పడే వారిని అరెస్ట్ చేసేందుకు భారీగా పోలీసులను మోహరించాలని కేరళ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో నిరసన కార్యక్రమాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. బంద్లో విద్యార్థులు, యువత పాల్గొనవద్దని సీపీ సూచించారు. పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కేసులు నమోదైతే ఉద్యోగాలకు అర్హత ఉండదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నా వెనక్కి తగ్గేది లేదని రక్షణ మంత్రిత్వ శాఖలోని మిలిటరీ వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆర్మీ, నేవి, ఎయిర్ఫోర్స్ ఉన్నతాధికారులు ఆదివారం అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్ కింద నియామకలకు సంబంధించిన తేదీలను సైతం ప్రకటించారు. ఈ సందర్భంగా నిరసనలో పాల్గొన్న ఆందోళనకారులపై కేసులు నమోదైతే త్రివిధ దళాల్లోకి తీసుకోబోమని స్పష్టం చేశారు.