న్యూఢిల్లీ : కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆర్మీ అభ్యర్థుల నిరసనలు హింసాత్మకంగా మారాయి. అయితే, అగ్నిపథ్ పథకం, అగ్నివీర్లకు సంబంధించి వాట్సాప్ గ్రూప్లో తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఆదివారం 35 వాట్సాప్ గ్రూప్లను నిషేధించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, కేంద్రం నిషేధం విధించిన ఈ వాట్సాప్ గ్రూప్ వివరాలు మాత్రం తెలియరాలేదు. ఈ వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసినవారిని, హింసాత్మక సంఘటనలకు ప్రేరేపించినవారిని గుర్తించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.
ఇప్పటి వరకు పది మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తున్నది. బిహార్లో ఈ నెల 17న ఉప ముఖ్యమంత్రి దాడి, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడం సహా పలు రాష్ట్రాల్లో నిరసనలు చేపట్టేందుకు వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగిస్తున్నారనే నివేదికల మధ్య హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. మరో వైపు అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో నిరసనలు, హింసాత్మక సంఘటనలు, రైళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పుపెట్టడం తదితర ఘటనల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది.
ఇలాంటి ఘటనలపై వాస్తవాల తనిఖీ కోసం పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ 8799711259 నంబర్లో నివేదించాలని కేంద్రం పౌరులకు విజ్ఞప్తి చేసింది. ఈ నెల జూన్ 17న, బీహార్ ప్రభుత్వం తన 12 జిల్లాల్లో ఆదివారం వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ప్రజలను రెచ్చగొట్టేందుకు, ఆస్తికి నష్టం కలిగించే ఉద్దేశంతో పుకార్లను వ్యాప్తి చేసేందుకు అభ్యంతరకరమైన కంటెంట్ను ప్రసారం చేయడానికి ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.