న్యూఢిల్లీ, జూలై 6: భారత వైమానిక దళంలో ఉద్యోగాలకు షార్ట్లిస్టు అయిన అభ్యర్థులు అగ్నిపథ్కు వ్యతిరేకంగా బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అగ్నిపథ్ ప్రభావం పడకుండా 2019లో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం తమ నియామకాలు పూర్తి చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.
కొత్త అగ్నిపథ్ స్కీమ్ను విధానాన్ని వర్తింపజేసేందుకు అన్నిరకాల టెస్టులు పూర్తయి తుది దశకు చేరుకున్న రిక్రూట్మెంట్ను రద్దు చేయడం ఏకపక్ష నిర్ణయమని, పూర్తిగా చట్టవిరుద్ధమని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(1) పిటిషన్దారులకు కల్పించిన హక్కులను ఉల్లంఘిస్తున్నదని పిటిషన్దారుల తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. జస్టిస్ సురేష్కుమార్, సౌరభ్ బెనర్జీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణను 2వారాలు వాయిదా వేసింది.