న్యూఢిల్లీ : కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం త్రివిధ దళాల ఉన్నతాధికారులు అగ్నిపథ్ స్కీమ్పై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన సంస్థలే విద్యార్థులను రొచ్చడుతున్నారని ఆరోపించారు. అయితే, ఆందోళనలో పాల్గొని ఎఫ్ఐఆర్ నమోదైన యువకులను.. ఎట్టి పరిస్థితుల్లో సైన్యం తీసుకోబోమని స్పష్టం చేశారు. భారత ఆర్మీ పునాదులు క్రమశిక్షణ నుంచే ఏర్పడ్డాయని, ఆస్తుల విధ్వంసానికి తావు లేదని, ప్రతి అభ్యర్థి నిరసనల్లో పాల్గొనలేదని ధ్రువపత్రం సమర్పించాలి ఉంటుందని, అది లేకుంటే ఎవరినీ చేర్చుకునేది లేదన్నారు.
విధ్వంసానికి పాల్పడలేదని ఎన్రోల్మెంట్లో రాతపూర్వకంగా పేర్కొనాలని, ఆ తర్వాత పోలీసుల ద్వారా వెరిఫికేషన్ ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్యోగంలో చేరిన అగ్నివీర్ ప్రాణాలు కోల్పోతే రూ.కోటి పరిహారం ఇవ్వనున్నట్లు రక్షణ శాఖ సైనిక వ్యవహారాల విభాగం కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురి తెలిపారు. సియాచిన్ వంటి పలు ప్రాంతాల్లో పనిచేసే అగ్నివీరులకు.. సాధారణ సైనికులతో సమానంగా అలవెన్సులు లభిస్తాయని చెప్పారు. సర్వీస్ విషయంలో ఎలాంటి వివక్ష ఉండబోదన్నారు. ఈ సంస్కరణ ద్వారా యువత, అనుభవజ్ఞుల కలయికతో కూడిన ఆర్మీని సిద్ధం చేయాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. సైన్యం సగటు వయసు పెరుగుతుండడం ఆందోళనకరమైన అంశమన్నారు. కార్గిల్ రివ్యూ కమిటీ సైతం దీనిపై ప్రస్తావించిందని గుర్తు చేశారు. ఈ సంస్కరణ చాలా కాలం నుంచి పెండింగ్లో ఉందన్నారు.
భారత వైమానిక దళంలో అగ్నిపథ్ స్కీమ్ కింద మొదటి బ్యాచ్లో అగ్నివీర్ల నియామక ప్రక్రియ జూన్ 24 నుంచి ప్రారంభమవుతుందని ఎయిర్ మార్షల్ వీకే ఝా తెలిపారు. ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుందని, నెల రోజుల తర్వాత జూలై 24న ఫేజ్-1 కింద ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ నాటికి తొలి బ్యాచ్నలు చేరుకుంటామని, డిసెంబర్ 30 నాటికి శిక్షణ మొదలుపెట్టనున్నట్లు వివరించారు.
మరో వైపు ఈ నెల 25 నుంచి నేవీ అగ్నివీర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేస్తుందని నేవీ వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి తెలిపారు. నెల రోజుల్లో నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని, మొదటి అగ్నివీర్ బ్యాచ్ నవంబర్ 21 నాటికి తమ తమ శిక్షణా శిబిరాలకు చేరుకుంటాయన్నారు. అగ్నివీర్ల నియామకానికి ఆర్మీ జూలై 1న నోటిఫికేషన్ జారీ చేయనున్నది. ఆ తర్వాత రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. డిసెంబర్ మొదటి వారానికల్లా ఆర్మీలో 25వేల మందిని రిక్రూట్ చేయనున్నారు. ఫిబ్రవరి 2023 నాటికి ఆర్మీలో రెండ్ బ్యాచ్ను నియామక ప్రక్రియను పూర్తి కానున్నది.