పట్నా: బీహార్ రాజధాని పట్నాలో ట్రాన్స్జెండర్లు ఆగ్రహించారు. గత 24 గంటల వ్యవధిలో నగరంలో ఇద్దరు ట్రాన్స్జెండర్లు హత్యకు గురవడంపై వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతా ఏకమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. నగరంలోని అన్ని ప్రధాన రహదారులను దిగ్బంధించారు. పట్నాలో తమ కమ్యూనిటీకి ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని, తరచూ తమపై దాడులు జరుగుతున్నాయని, ఇప్పుడు ఏకంగా హత్యలే చేశారని వారు మండిపడుతున్నారు.
ప్రభుత్వం ఇద్దరు ట్రాన్స్జెండర్ల హత్యలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, ఇకపై ఇలాంటి హత్యలు పునరావృతం కాకుండా సరైన రక్షణలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేవరకు తాము ఆందోళన విరమించబోమని ఆందోళన చేస్తున్న ట్రాన్స్జెండర్లలో ఒకరైన పూజ తెగేసి చెప్పారు. కాగా, పట్నాలో నిన్న ఒక ట్రాన్స్జెండర్ హత్యకు గురికాగా, ఇవాళ ఉదయం మరో ట్రాన్స్జెండర్ను కాల్చిచంపారు.