న్యూఢిల్లీ : షారుక్ ఖాన్ ఎవరని ప్రశ్నించి 24 గంటలు గడవక ముందే అసోం సీఎం హిమంత బిశ్వశర్మ కింగ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్ర ప్రదర్శనకు భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు. గువహటిలో షారుక్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ విడుదలయ్యే థియేటర్లో హింస చెలరేగిన నేపథ్యంలో అసో సీఎం స్పందించారు. షారుక్ ఖాన్ తనకు ఆదివారం తెల్లవారుజామున ఫోన్ చేశారని, గువహటి థియేటర్లో జరిగిన హింసాకాండపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారని, శాంతిభద్రతలు సజావుగా ఉండేలా తాము చర్యలు చేపడతామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తాను ఆయనకు హామీ ఇచ్చానని శర్మ తెలిపారు.
కాగా గువహటి థియేటర్లలో పఠాన్ పోస్టర్లను భజరంగ్ దళ్ కార్యకర్తలు చించివేసిన ఘటన గురించి శనివారం అసోం సీఎంను ప్రశ్నించగా షారుక్ ఖాన్ ఎవరని ప్రశ్నించిన శర్మ తనకు అతడి గురించి అతడి సినిమా పఠాన్ గురించి ఏమీ తెలియదని బదులివ్వడం విశేషం. రరాష్ట్ర ప్రజలు అస్సామీ మినహా హిందీ సినిమాల గురించి పట్టించుకోరని వ్యాఖ్యానించారు. తనకు బాలీవుడ్ ప్రముఖులు చాలా మంది ఫోన్లు చేస్తారని, షారుక్ ఖాన్ మాట్లాడరని చెప్పారు.
షారుక్ ఫోన్ చేసి మాట్లాడితే ఈ వ్యవహారంపై దృష్టిసారిస్తానని అన్నారు. కాగా నరంగి ప్రాంతంలో పఠాన్ విడుదలయ్యే థియేటర్ను శుక్రవారం భజరంగ్ దళ్ కార్యకర్తలు చుట్టుముట్టి జై శ్రీరాం నినాదాలు చేస్తూ మూవీ పోస్టర్లను చించివేసి దగ్ధం చేశారు. మరోవైపు పఠాన్ మూవీపై సోషల్ మీడియాలో హిందూ సంఘాలు బాయ్కాట్ ట్రెండ్ నడిపిస్తున్నాయి.