ఇంఫాల్: గగనతలంలో గుర్తు తెలియని డ్రోన్లు కనిపించాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయాన్ని మూసివేశారు. అల్లర్లు, హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో రాజధాని ఇంఫాల్లోని బిర్ టికేంద్రజిత్ అంతర్జాతీయ విమానాశ్రయం గగనతలంలో గుర్తుతెలియని డ్రోన్లు ఎగురుతుండటాన్ని గమనించారు. ఈ నేపథ్యంలో వెంటనే ఆ ఎయిర్పోర్ట్ను మూసివేశారు. (Imphal airport shut) ఆ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన విమానాలను రద్దు చేశారు. అక్కడికి చేరుకోవాల్సిన విమానాలను ఇతర ఎయిర్పోర్టులకు మళ్లించారు.
కాగా, మణిపూర్లోని మైతీ వర్గానికి ఎస్టీ హోదా కల్పించేందుకు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. కొండ ప్రాంతాల్లో అత్యధికంగా నివసించే కుకీ వర్గం ప్రజలు దీనిని వ్యతిరేకించారు. మే నెలలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించగా నాటి నుంచి ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. హింసాత్మక సంఘటనల్లో సుమారు 200 మంది మరణించగా వేల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. మరోవైపు శాంతిభద్రతలు అదుపులోకి రాకపోవడంతో మణిపూర్ ప్రభుత్వం ఇంటర్నెట్పై నిషేధాన్ని నవంబర్ 23 వరకు పొడిగించింది.