Mann ki Baat | ప్రధాని నరేంద్ర మోదీ నెలవారీ కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 124 ఎసిసోడ్లో జాతినుద్దేశించి మాట్లాడారు. విజ్ఞానం, క్రీడలు, సంస్కృతిక, భారత్ సాధించి విషయాలపై ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో భారత్లో చాలా విశేషాలు చోటు చేసుకున్నాయని.. అవన్నీ ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. ఇటీవల శుభాన్షు శుక్లా ఐఎస్ఎస్కు వెళ్లి.. భూమిపైకి చేరుకోగానే దేశమంతా ఆనందంతో, గర్వంతో నిండిపోయిందని మోదీ పేర్కొన్నారు. చంద్రయాన్-3ని విజయవంతంగా ల్యాండింగ్ చేసిన తర్వాత దేశంలో ఓ ప్రత్యేకమైన శాస్త్రీయ వాతావరణం ఏర్పడిందని తెలిపారు. ప్రస్తుతం పిల్లలు సైతం స్పేస్సైన్స్పై ఆసక్తి చూపుతున్నారన్నారు. ఇన్స్పైర్ మనక్ అభియాన్ గురించి ప్రధాని మాట్లాడారు. ఈ పథకం విద్యార్థులను ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సహించే కార్యక్రమని తెలిపారు. ప్రతి పాఠశాల నుంచి ఐదుగురిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
ప్రతి విద్యార్థి ఓ కొత్త ఆలోచనతో వస్తారని.. ఇప్పటి వరకు ఇందులో లక్షలాది మంది చేరారన్నారు. చంద్రయాన్-3 విజయం తర్వాత ఈ సంఖ్య రెట్టింపయ్యిందని చెప్పారు. భారత్లో ఐదేళ్ల క్రితం దేశంలో 50 కంటే తక్కువ స్పేస్ స్టార్టప్స్ మాత్రమే ఉండేవని.. ప్రస్తుతం స్పేస్ రంగంలో 200 కంటే ఎక్కువ స్టార్టప్స్ ఉన్నాయని వివరించారు. ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. దీన్ని ఎలా జరుపుకుంటారు? కొత్త ఆలోచనలను నమో యాప్ ద్వారా తనకు తెలియజేయాలని కోరారు. భారత విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్నారన్నారు. ఇటీవలి ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో దేవేష్ పంకజ్, సందీప్ కూచి, దేవదత్ ప్రియదర్శి, ఉజ్వల్ కేసరీలు మెడల్స్ సాధించి దేశానికి గౌరవం తీసుకువచ్చారన్నారు. అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్లో భారత విద్యార్థులు మూడు బంగారు, రెండు వెండి, ఒక కాంస్య పతకాన్ని గెలిచారన్నారు.
ముంబయిలో వచ్చే నెల జరుగబోయే ఆస్ట్రానమి, ఆస్ట్రోఫిజిక్స్ ఒలింపియాడ్ జరుగునుందని చెప్పారు. ఇది అతిపెద్ద ఒలింపియాడ్ అవుతుందన్నారు. భారత్ ఇప్పుడు ఒలింపిక్స్, ఒలింపియాడ్లో ముందుకెళ్తోందన్నారు. యునెస్కో 12 మరాఠా కోటలను ప్రపంచవారసత్వ స్థలాలుగా గుర్తించిందని.. ఇందులో 11 మహారాష్ట్రలో, ఒకటి తమిళనాడులో ఉన్నాయన్నారు. సల్హేర్ కోటలో మొఘలులు ఓడిపోయారని.. ఛత్రపతి శివాజీ మహారాజ్ శివనేరిలో జన్మించారన్నారు. ఖండేరిలో సముద్రం మధ్యలో ఒక కోట ఉందని.. శత్రువు ఆయనను ఆపాలని కోరుకున్నా.. శివాజీ మహారాజ్ అసాధ్యాన్ని సాధ్యం చేశాడని తెలిపారు. ప్రతాప్గఢ్ కోటలో అఫ్జల్ ఖాన్ ఓడిపోగా.. విజయదుర్గ్లో రహస్య సొరంగాలున్నాయని.. ఛత్రపతి శివాజీ మహరాజ్ దూరదృష్టికి ఈ కోట సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. తాను రాయ్గఢ్ సందర్శించిన సమయంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం ముందు నమస్కరించే అవకాశం తనకు లభించిందని తెలిపారు.