పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) బీజేపీ నేతను ప్రశంసించారు. ఆ నేతతో తనకు జీవిత కాలం స్నేహం ఉంటుందని అన్నారు. అయితే నితీశ్ కుమార్కు తలుపులు మూసుకుపోయాయని బీజేపీ విమర్శించింది. గురువారం మోతీహరిలోని మహాత్మా గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ స్నాతకోత్సవం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, బీహార్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, సీఎం నితీశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితీశ్ కుమార్ మాట్లాడారు. మహాత్మా గాంధీ చంపారన్ సత్యాగ్రహాన్ని ప్రారంభించిన మోతీహరిలో యూనివర్సిటీ ఏర్పాటు కోసం కేంద్రంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వంతో తనకు జరిగిన గొడవ గురించి వివరించారు. 2014లో కేంద్రంలో అధికారం మారిన తర్వాత ఈ దిశగా పురోగతి సాధించినట్లు తెలిపారు.
కాగా, మోదీ తొలి క్యాబినెట్లో కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న స్థానిక బీజేపీ ఎంపీ రాధా మోహన్ సింగ్తో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా నితీశ్ కుమార్ గుర్తు చేశారు. ఆయన వైపు వేలు చూపుతూ.. తాను జీవించి ఉన్నంత వరకు తమ మధ్య స్నేహం ఉంటుందని తెలిపారు. విభేదాలు వీడి కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు.
మరోవైపు బీహార్ బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి దీనిపై స్పందించారు. నితీశ్ కుమార్కు బీజేపీ తలుపులు మూసుకుపోయాయని విమర్శించారు. గత ఏడాది బీజేపీతో కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వం నుంచి ఆయన వైదొలగిన తీరుపై మండిపడ్డారు.