పాట్నా: రెండు రోజుల కింద అదృశ్యమైన మహిళ శవమై కనిపించింది. దీంతో గ్రామస్తులు ఆగ్రహించారు. ఫిర్యాదుపై నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో పోలీసులపై దాడి చేశారు. ఒక పోలీస్ వాహనానికి నిప్పుపెట్టారు. న్యూస్ కవర్ చేసేందుకు వచ్చిన జర్నలిస్టులపై కూడా దాడి చేశారు. దీంతో కొందరు గాయపడ్డారు. బీహార్లోని నవ్గాచియాలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 16న పాలు అమ్మేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన శోభాదేవి అనే మహిళ కనిపించకుండా పోయింది. ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, ఆ మహిళ మృతదేహాన్ని ఆదివారం గుర్తించారు. దీంతో ఫిర్యాదుపై నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ పోలీసులపై గ్రామస్తులు దాడి చేశారు. ఒక పోలీస్ వాహనానికి నిప్పుపెట్టారు. న్యూస్ కవరేజ్ కోసం వచ్చిన జర్నలిస్టులను కూడా కొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు, అధికారులు ఆ గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అలాగే ఆ గ్రామంలో పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులను మోహరించారు. మహిళ హత్యపై దర్యాప్తు చేస్తున్నారు.