మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలకు కేంద్ర హోంమంత్రి అమిత్షా కౌంటర్ ఇచ్చారు. యూపీలోని రాయ్బరేలీ ప్రచారంలో అమిత్షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ హయాంలో కొందరు ఏకంగా జవాన్ల తలలు నరిక్కెళ్లారు, అయినా మన్మోహన్ చేసిందేమీ లేదంటూ ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో సోనియా- మన్మోహన్ ప్రభుత్వమే దేశాన్ని ఏలిందని, సమాజ్వాదీ, బహుజన్ సమాజ్వాదీ మద్దతు కూడా తీసుకుందని, అయినా చేసిందేమీ లేదని విరుచుకుపడ్డారు. పుల్వామా దాడి జరిగినప్పుడు గత ప్రభుత్వాల్లాగే బీజేపీ కూడా ఏమీ చేయదని కొందరు భ్రమల్లో ఉండిపోయారన్నారు. సీఎంగా యోగి పగ్గాలు చేప్పటినప్పటి నుంచి బాహుబలీలు లేరని, కేవలం బజరంగబళీలు మాత్రమే ఉన్నారన్నారని అమిత్షా అన్నారు.
మన్మోహన్ సింగ్ ఏమన్నారంటే..
పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్కు మాత్రమే ఓటు వేయాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇన్ని సంవత్సరాలుగా బీజేపీ పాలిస్తున్నా… ఇంకా దేశ తొలి ప్రధాని నెహ్రూనే ప్రతి దానికీ తప్పుపడుతోందని ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి అన్న పదవికి ఓ ప్రాముఖ్యత ఉంటుందని సూచించారు. స్వప్రయోజనాల కోసం దేశాన్ని నెహ్రూ ఎన్నడూ విభజించలేదని చురకలంటించారు. తాను ప్రధానిగా ఉన్న సమయంలో కేవలం పని ద్వారానే సంకేతాలు పంపామని, ప్రపంచం ముందు పరువు పోకుండా కాపాడామని మన్మోహన్ తన వీడియోలో పేర్కొన్నారు.