గాంధీనగర్, అక్టోబర్ 13: కేరళలో మహిళల నరబలిపై విచారణ కొనసాగుతున్న సమయంలోనే గుజరాత్లో మరో దారుణం జరిగింది. ఆర్థికపరమైన లాభాలు కలుగుతాయనే నమ్మకంతో తమ 14 ఏళ్ల కూతురిని ఓ కన్నతండ్రి క్షుద్రపూజలు చేసి చంపినట్టు తెలుస్తున్నది. గిర్సోమనాథ్ జిల్లా ధరా గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతున్నది. నవరాత్రి రోజు ఆ కుటుంబం తన కూతురుని బలిచ్చిందని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.
ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగి ఫోరెన్సిక్ నిపుణులు బృందం సహాయంతో బాలిక చితాభస్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలిక తండ్రి భవేశ్ అక్బరీని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. ఆమె చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో పొలంలోనే అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన తేడాగా ఉందని గమనించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రి భవేశ్ ఇచ్చిన సమాధానాలు తికమకగా ఉండడంతో పోలీసుల అనుమానం బలపడింది. అనుమానాస్పద మృతికింద కేసు నమోదు చేసి, విచారిస్తున్నట్టు ఎస్పీ మనోహర్సిన్హ్ జడేజా తెలిపారు.