న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. (vote of confidence motion) మద్యం పాలసీ స్కామ్పై ఈడీ ఆరోసారి సమన్లు జారీ చేయడం, ఢిల్లీ కోర్టుకు కూడా హాజరుకావాల్సి ఉండటంతో ఆయనను అరెస్ట్ చేయవచ్చన్న ఊహాగానాలు వస్తుండటంతో ఈ చర్యకు దిగారు. శనివారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని నిర్ణయించారు. శుక్రవారం అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అరవింద్ కేజ్రీవాల్, ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో అన్నదానిపై మాట్లాడారు. బీజేపీ సభ్యులు ఆప్ ఎమ్మెల్యేలను సంప్రదించారని, ఢిల్లీ సీఎంను త్వరలో అరెస్ట్ చేస్తారని వారితో చెప్పారని అన్నారు. అలాగే 21 మంది ఆప్ ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు అంగీకరించారని, మరికొంత మంది బీజేపీతో టచ్లో ఉన్నట్లు ఆప్ ఎమ్మెల్యేలతో చెప్పడంతోపాటు బీజేపీలో చేరేందుకు రూ.25 కోట్లు ఆఫర్ చేశారని ఆరోపించారు.
కాగా, బీజేపీ ఆఫర్కు తాము అంగీకరించలేదని ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు తనకు చెప్పారని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అలాగే ఇతర ఆప్ ఎమ్మెల్యేలతో మాట్లాడగా ఏడుగురిని బీజేపీ ఎమ్మెల్యేలు సంప్రదించినట్లు తెలిసిందన్నారు. దీంతో మరోసారి ఆపరేషన్ కమలం కోసం బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఈ నేపథ్యంలో మద్యం పాలసీ కుంభకోణంపై వచ్చిన ఆరోపణలు ఆ స్కామ్ గురించి కాదన్నది స్పష్టమవుతున్నదని కేజ్రీవాల్ అన్నారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తప్పుడు కేసులు పెట్టి తమ పార్టీని విచ్ఛిన్నం చేసి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నమని ఆరోపించారు.
మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లక్ష్యం మద్యం పాలసీపై దర్యాప్తు చేయడం కాదని, తమ నాయకులను అరెస్ట్ చేయడమేనని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఇప్పటికే కొందరిని అరెస్టు చేశారని అన్నారు. మద్యం పాలసీ కేసు ముసుగులో ప్రభుత్వాన్ని పడగొట్టడమే వారి లక్ష్యమని విమర్శించారు. వారు ఢిల్లీలో ఎప్పటికీ ఎన్నికల్లో గెలువలేరని తెలుసు కాబట్టి ఇలాంటి కుట్రకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో తమ పార్టీకి అసెంబ్లీలో మెజార్టీ ఉన్నప్పటికీ, బీజేపీ ప్రయత్నాలను ఎండగట్టేందుకు విశ్వాస పరీక్షను ఎదుర్కొంటామని అన్నారు.