AAP | ఆమ్ ఆద్మీ పార్టీ ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’పై అభిప్రాయాలను ఉన్నత స్థాయి కమిటీకి పంపింది. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి ‘వన్ నేషన్ -వన్ ఎలక్షన్’ అత్యున్నత స్థాయి కమిటీ కార్యదర్శి నితేన్ చంద్రకు లేఖ రాశారు. ఒకే దేశం – ఒకే ఎన్నిక ఆలోచనను ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకిస్తోందని ఆప్ స్పష్టం చేసింది. ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ అనేది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి, దేశ సమాఖ్య రాజకీయాలకు విఘాతం కలిగిస్తుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ హంగ్ అసెంబ్లీని ఎదుర్కోలేకపోతోందని, ఫిరాయింపులు, హార్స్ ట్రేడింగ్ను క్రియాశీలకంగా ప్రోత్సహిస్తుందన్నారు.
ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఆదా చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యయం భారత ప్రభుత్వ వార్షిక బడ్జెట్లో 0.1శాతం మాత్రమేనన్నారు. ఇదిలా ఉండగా.. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’పై ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం పార్లమెంటరీ పాలనా విధానాన్ని అవలంబిస్తున్న దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ఆలోచనకు తావు లేదని, దాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమన్నారు. ఏకకాల ఎన్నికల విధానాన్ని అమలు చేయాలంటే రాజ్యాంగంలో గణనీయంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగం కల్పించిన ఫెడరలిజానికి విరుద్ధమన్నారు.