న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ధిక్కార స్వరంతో పోస్టులు పెట్టిన ఇద్దరు వ్యక్తులను సీబీఐ ఆదివారం అరెస్ట్ చేసింది. దిగువ కోర్టుల జడ్జిల ప్రాణానికి ముప్పు ఉన్నా దర్యాప్తు సంస్థలు ప్రతిస్పందించడం లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకు సీబీఐ స్పందించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలపై పోస్టుల విషయమై మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసింది సీబీఐ. గత నెల తొమ్మిదో తేదీన ఒకరిని, చివరిగా ఈ నెల ఏడవ తేదీన ఒకరిని అదుపులోకి తీసుకున్నది.
కొన్ని కేసుల్లో కోర్టు తీర్పులు వచ్చిన తర్వాత న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులో పెట్టారని వారిపై సీబీఐ అభియోగం. వివిధ డిజిటల్ ప్లాట్ఫామ్లపై పోస్టులు పెట్టిన 16 మందితో 13 మందిని ట్రేస్ చేసింది. మిగతా ముగ్గురు విదేశాల్లో ఉన్నారు. ఇప్పటివరకు 13 మందిలో 11 మందిని విచారించింది. ఐదుగురిని అరెస్ట్ చేసింది.
నిందితుల ఇండ్లలో సీబీఐ తనిఖీలు జరిపి, నేరపూరిత పత్రాలను స్వాధీనం చేసుకున్నది సీబీఐ. గతేడాది నవంబర్లో 506 సెక్షన్తోపాటు పలు సెక్షన్లు, ఐటీ చట్టంలోని 67 సెక్షన్ కింద వారిపై అభియోగాలు మోపింది.