Revanth Reddy | న్యూఢిల్లీ : బీహార్ డీఎన్ఏ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై జాతీయ స్థాయి నాయకులు మండిపడుతున్నారు. బీహార్ డీఎన్ఏను కాదని తెలంగాణ డీఎన్ఏను ప్రజలు ఎన్నుకున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. బీహార్ ప్రజలను కించపరిచేలా రేవంత్ వ్యాఖ్యానించారని ఆ రాష్ట్ర నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నా డీఎన్ఏ తెలంగాణ. కేసీఆర్ డీఎన్ఏ బీహార్ది. ఎందుకంటే ఆయన పూర్వీకులు బీహార్కు చెందినవారు. అక్కడ్నుంచి విజయనగరం వలసొచ్చి, అనంతరం తెలంగాణకు వచ్చి స్థిరపడ్డారు. ఈ క్రమంలో బీహార్ డీఎన్ఏ కంటే తెలంగాణ డీఎన్ఏనే బెటర్ అని తనను ప్రజలు ఎన్నుకున్నారని రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై జేడీయూ లీడర్ నీరజ్ కుమార్ స్పందించారు. 2015 ఎన్నికల్లో ప్రధాని మోదీ కూడా ఈ విధంగా మాట్లాడి, బీహార్లో ఓటమి పాలయ్యారని గుర్తు చేశారు. ఈ దేశంలో తెలంగాణ డీఎన్ఏ, బీహార్ డీఎన్ఏ ఉండదు.. అందరిలో హిందూస్థాన్ డీఎన్ఏనే ఉంటుందన్నారు. సీఎం రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలతో ఇండియా కూటమి మరింత బలోపేతం అవుతుందని ఆయన అనుకుంటున్నారా..? అని నీరజ్ కుమార్ ప్రశ్నించారు.
బీజేపీ నాయకుడు రవి శంకర్ ప్రసాద్ కూడా రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమన్నారు. రేవంత్ వ్యాఖ్యలను ఇండియా కూటమి ఖండించాలని, అతనితో క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు సమాజానికి సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారా..? అసలు ఇండియా కూటమి సభ్యులు ఎందుకు మౌనంగా ఉన్నారు..? రేవంత్ వ్యాఖ్యలపై నితీశ్ కుమార్ ఎందుకు నోరు విప్పడం లేదు..? బీహార్లోని కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారని రవి శంకర్ ప్రసాద్ ప్రశ్నించారు.
బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ రేవంత్ వ్యాఖ్యలపై స్పందించారు. బీహార్ ప్రజలకు రేవంత్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఇండియా కూటమి సభ్యులు అవమానిస్తూనే ఉన్నారు. బీహార్ డీఎన్ఏ కంటే తెలంగాణ డీఎన్ఏ గొప్పదని మాట్లాడటం సరికాదన్నారు.