UP Polls | అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీకి మరో షాక్ తగిలింది. ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణ యాదవ్ బీజేపీలో చేరి, షాకిచ్చిన విషయం విదితమే. తాజాగా అఖిలేశ్ యాదవ్ మామ, మాజీ ఎమ్మెల్యే ప్రమోద్ కుమార్ గుప్త కూడా బీజేపీలో చేరుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. సమాజ్వాదీ పార్టీ తన మూలా సిద్ధాంతం నుంచి ఎప్పుడో పక్కకు తప్పిపోయిందని విమర్శించారు. ప్రస్తుతం ములాయం సింగ్ యాదవ్, శివపాల్ యాదవ్ గౌరవం ఏమాత్రం లేదని, అందుకే తాను బీజేపీలో చేరిపోతున్నానని ప్రకటించారు.
జూదం ఆడుతున్న వారిని, భూకబ్జాలకు పాల్పడుతున్న వారికి పార్టీలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ములాయం, శివపాల్ యాదవ్లిద్దరూ సమాజ్వాదీలో తీవ్ర వేధింపులకు గురవుతున్నారని, ములాయంను ఏకంగా గృహ నిర్బంధం చేసేశారని, ఎవ్వర్నీ కలవకుండా చేస్తున్నారని పరోక్షంగా అఖిలేశ్పై తీవ్రంగా ఆరోపణలు చేశారు. ములాయం పుట్టిన రోజున కూడా ఆయన ఏమీ మాట్లాడకుండా చేసేశారని, మైక్ను కూడా లాగేసుకున్నారని ప్రమోద్ కుమార్ గుప్తా విమర్శించారు.
ఎల్.ఎస్. ప్రమోద్ కుమార్ గుప్తా ములాయం రెండో భార్య సాధన యాదవ్ బావ. ఇప్పటి వరకూ శివపాల్ యాదవ్ నేతృత్వంలోని ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీ కార్యవర్గ సభ్యునిగా ఉన్నారు. ములాయం సింగ్ యాదవ్కు అత్యంత సన్నిహితుడిగా పేరు గడించారు. 2007 లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయనకు పార్టీ టిక్కెట్ నిరాకరించింది. దీంతో ప్రమోద్ కుమార్ స్వతంత్రంగా బరిలోకి దిగి, గెలుపొందారు.దీంతో ఆయన సత్తా ఏమిటో పార్టీకి తెలిసొచ్చింది. 2012 లో బిధునా నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా బరిలోకి దిగి, బంపర్ మెజారిటీతో గెలుపొందారు.