PM Narendra Modi | ఒకనాడు ఎనిమిదేండ్ల క్రితం దేశానికి గుజరాత్ ఒక అభివృద్ధి మోడల్.. దేశమంతా ఇదే అభివృద్ధి చేస్తాం అంటూ 2014 లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ప్రధాని- నాటి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ ఊదరగొట్టారు. అంతకుముందు 2002 నుంచి 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ గెలుపొందే నాటికి గుజరాత్కు సీఎంగా నరేంద్రమోదీ పని చేశారు. 2014 నుంచి దేశ ప్రధానిగా నరేంద్రమోదీ పని చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్రం దేశానికి ఎంత ఆదర్శమో.. ఈ ఉదంతం తెలియజేస్తుంది. దక్షిణ గుజరాత్లో ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా నివసించే పల్లెటూరు సంద్కువా.. ఇది తాపీ జిల్లాలో ఉంది. ఈ గ్రామానికి విశేషం ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్ల తర్వాత ఈ నెల 12వ తేదీన తొలిసారి ఈ ఊరికి రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు వచ్చింది.
దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతాం.. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం.. స్విస్బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి భారతీయుడి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తాం.. ఏటా రెండు కోట్ల మందికి కొలువులు తెస్తాం అన్నారు ప్రధాని మోదీ. 2002 నుంచి 2013 వరకు గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు నరేంద్రమోదీ ఆధ్వర్యంలో ఆ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని పదేపదే ప్రచారం సాగింది. కానీ, ఆయన సీఎంగా ఉన్నప్పుడు గానీ.. దేశానికి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఎనిమిదేండ్ల తర్వాత గానీ తన సొంత రాష్ట్రంలోని ఒక మారుమూల గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించలేకపోయారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
సంద్కువా గ్రామస్తులు గత 75 ఏండ్లుగా బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులకు, ప్రజా ప్రతినిధులు అర్జీలు సమర్పిస్తూనే ఉన్నారు. కానీ, ఈ గ్రామస్తుల అర్జీలు చెత్త బుట్టలో పడేశారే గానీ అధికారులు.. పల్లెజనం ఆశలు.. ఆకాంక్షలు పట్టించుకోలేదు. డిమాండ్ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. గమ్మత్తేమిటంటే త్వరలో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగబోతున్నాయి. 2002లో సీఎంగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి గుజరాత్లో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదిగింది.
ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో బీజేపీ ఓటమి పాలైతే.. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. విపక్షాలు పుంజుకునే చాన్స్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ.. గుజరాత్లో ప్రజల అసంతృప్తిని కనిపెట్టింది. ఆయా పల్లెలు, పట్నాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే సంద్కువా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించారు గుజరాత్ ఆర్టీసీ అధికారులు. ఈ సందర్భాన్ని వేడుకగా చేసుకోవాలనుకున్నారు సంద్కువా గ్రామస్తులు. ఆ బస్సుకు పూలమాలలు వేసి, మేళ తాళాలతో బైక్ల ర్యాలీ మధ్య ఊరంతా ఊరేగింపుగా తీసుకెళ్లారు. 75 ఏండ్లుగా బస్సు వసతి కోసం స్థానికులు, ముఖ్యంగా విద్యార్థులు బస్సు సౌకర్యం లేక ఇబ్బంది పడ్డారని సర్పంచ్ సునిల్ గామిత్ చెప్పారు.
పలువురు విద్యార్థినులు మాట్లాడుతూ తాము కాలేజీలకు వెళ్లాలంటే అవస్థలు పడేవాళ్లం అని అన్నారు. రోజూ రెండు మూడు కిలోమీటర్లు నడిచి మెయిన్ రోడ్డుకెళితేనే బస్సో, ఆటో దొరుకుతుందని చెప్పారు. అంత దూరం నడవడం చాలా కష్టం వర్షాకాలమైతే ఇంకా ఇబ్బంది పడేవాళ్లం అని వాపోయారు. ఇన్నేండ్లుగా ఈ ఊరికి బస్సు కనెక్టివిటీ లేనే లేదని మోహన్ గామిత్ అనే టీచర్ చెప్పారు. తొలిసారి టీచర్గా పోస్టింగ్ ఈ ఊరికి వచ్చినప్పుడు మోటారు సైకిల్పై రావాల్సి వచ్చేదని తెలిపారు.
బస్సు సౌకర్యం కోసం అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నో వినతిపత్రాలు సమర్పించామని స్థానికులు చెబుతున్నారు. కానీ, వాటన్నింటినీ అధికారులు పెడచెవిన పెట్టారని ఆరోపిస్తున్నారు. ఏండ్లు పూండ్లు గడిచినా వాండ్ల డిమాండ్లు మాత్రం నెరవేరలేదు. 75 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాతే ఈ గ్రామానికి బస్సు సౌకర్యం వచ్చింది. ‘బస్సు సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలన్నింటికి సర్వీసులు నడుపుతామని మేం ప్రకటించాం’ అని స్థానిక డిపో మేనేజర్ మనోజ్ చౌదరి తెలిపారు. ‘అక్టోబర్ 12న సంద్కువా గ్రామానికి తొలి బస్సు సౌకర్యం కల్పించాం. ఓ కొత్త బస్సును ఆ ఊరికి పంపించాం. ఉదయం ఒక సర్వీస్ నడుస్తుంది. విద్యార్థుల కోసం ప్రత్యేక సర్వీస్ ఉంటుంది. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్ల తర్వాత గ్రామానికి మొదటిసారి బస్సు వచ్చింది’ అని తెలిపారు.
ఇటీవల దేశ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. ఆమె ఆదివాసీ గిరిజన మహిళ. ద్రౌపది ముర్ముది ఒడిశాలోని ఒక మారుమూల గ్రామం. బీజేపీ నాయకురాలిగా.. బిజూ జనతాదళ్ (బీజేడీ)తో కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ సర్కార్లో మంత్రిగా పని చేశారు. రాష్ట్రపతిగా ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాతే ముర్ము సొంతూరికి విద్యుత్ సౌకర్యం వచ్చింది. కేంద్రంలోనూ, సగానికి పైగా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ పాలనలో సాధించిన ‘డబుల్ ఇంజిన్ గ్రోత్’ ఇదేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.