న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశంలో న్యాయవ్యవస్థకు గడ్డు కాలం దాపురించిందని సుప్రీంకోర్టుతోపాటు వివిధ హైకోర్టులకు చెందిన 21 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. తప్పుడు సమాచారం, ప్రణాళికాబద్ధమైన ఒత్తిడులు, బహిరంగంగా అవమానించడం ద్వారా న్యాయ వ్యవస్థను అణగదొక్కేందుకు కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నానాటికీ పెరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల నుంచి న్యాయ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరమున్నదంటూ సీజేఐకి లేఖ రాశారు.
వ్యక్తిగత, సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు విపరీత చర్యలకు పాల్పడుతున్నారని, దీని వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. అధికార, విపక్ష నాయకుల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం, ప్రతిపక్ష నేతలపై అవినీతి కేసులు, బాధిత నాయకులకు న్యాయస్థానాల్లో ఎలాంటి ఉపశమనం లభించకపోవడం తదితర అంశాలను ఆ లేఖలో ప్రస్తావించారు. ఒత్తిడులకు లొంగకుండా న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని కాపాడాలని సీజేఐను కోరారు.