న్యూఢిల్లీ, మార్చి 11: ఉగ్రవాదులతో పోరాడుతూ తండ్రి వీరమరణం పొందినప్పుడు ఆమె మూడేండ్ల చిన్నారి. 20 ఏండ్ల తర్వాత.. తండ్రి యూనిఫాం ధరించి, సైన్యంలోకి సగర్వంగా అడుగుపెట్టారు లెఫ్టినెంట్ ఇనాయత్ వత్స్. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొందిన ఆమె ఈ నెల 9న భారత సైన్యంలో విధుల్లో చేరారు.
పాసింగ్ అవుట్ పరేడ్లో తన తండ్రి చివరిసారిగా ధరించిన ఆలీవ్ గ్రీన్ యూనిఫామ్నే ఆమె ధరించారు. ఈ సందర్భంగా ‘ఆర్మీ కూతురు లెఫ్టినెంట్ ఇనాయత్ వత్స్కు స్వాగతం’ అంటూ భారత సైన్యం ఎక్స్లో పోస్ట్ చేసింది. ఇనాయత్ వత్స్ ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ చదివారు. ఆమె తండ్రి మేజర్ నవనీత్ వత్స్ నవంబర్ 2003లో శ్రీనగర్లో జరిగిన ఒక ఎన్ కౌంటర్లో చనిపోయారు. ఆయన ధైర్యసాహసాలకు మెచ్చిన కేంద్రం సేనా మెడల్ ప్రకటించి గౌరవించింది.