Aftab narco test | శ్రద్ధావాల్కర్ దారుణ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ నార్కో పరీక్షలు కొద్దిసేపటికి క్రితం ముగిశాయి. దాదాపు రెండు గంటల పాటు అఫ్తాబ్ను నార్కో పరీక్ష సందర్భంగా ప్రశ్నించారు. శ్రద్ధా వినియోగించిన మొబైల్ ఫోన్, ఇతర వస్తువుల గురించి పోలీసులు ఆరా తీశారు. పరీక్షలో అడిగిన ప్రశ్నలకు అఫ్తాబ్ ఇంగ్లిష్లోనే సమాధానమిచ్చాడని దవాఖాన వర్గాలు తెలిపాయి. నార్కో టెస్టులో సైకాలజిస్టులు, ఫోరెన్సిక్ ల్యాబ్ రోహిణికి చెందిన ఫొటో నిపుణులు, అంబేద్కర్ దవాఖాన వైద్యులు పాల్గొన్నారని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అసిస్టెంట్ డైరెక్టర్ సంజీవ్ గుప్తా తెలిపారు.
ఢిల్లీ పోలీసులు అఫ్తాబ్ను గురువారం ఉదయం 8.40 గంటలకు రోహిణిలోని బాబా సాహెబ్ అంబేద్కర్ దవాఖానకు తీసుకొచ్చారు. అక్కడ నార్కో పరీక్షకు ముందు అతడికి సాధారణ వైద్య పరీక్షలు జరిపారు. ఉదయం 10 గంటలకు మొదలైన పరీక్ష దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. పాలిగ్రాఫ్ పరీక్ష అనంతరం అఫ్తాబ్ నార్కో టెస్ట్లోనూ శ్రద్ధాను చంపినట్లు అంగీకరించినట్లు సమాచారం. శ్రద్ధావాల్కర్ వాడిన మొబైల్, దుస్తులను ఎక్కడ విసిరేశాడో కూడా సమాచారమిచ్చినట్లు తెలుస్తున్నది.
నార్కో పరీక్ష అసంపూర్తిగా జరిగిన పక్షంలో పోలీసులు అఫ్తాబ్కు బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్ష నిర్వహించే అవకాశాలు ఉంటాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అఫ్తాబ్ చాలా తెలివైన వాడని, ఏ సమయంలోనైనా ఈ కేసులో కొత్త ట్విస్ట్ తీసుకురాగలడని ఓ అధికారి మీడియాకు చెప్పారు. ఇప్పటివరకు పోలీసుల మాటకు కట్టుబడి సహకరిస్తున్నాడని, పాలిగ్రాఫ్, నార్కో పరీక్షలకు కూడా అంగీకరించాడని ఆయన తెలిపారు. అతడు చూపుతున్న మంచి ప్రవర్తనపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ.. ఏప్పుడైనా ప్లేట్ పిరాయించి ముప్పుతిప్పలు పెట్టగలడని భావిస్తున్నారు.