ED Affidavit | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ను ఈడీ వ్యతిరేకించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో గురువారం ఈడీ అఫిడవిట్ దాఖలు చేసింది. చట్టం అందరికీ సమానమేనని.. ఎన్నికల ప్రచారం అనేది రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక, చట్టబద్ధమైన హక్కు కాదని పేర్కొంది. ఎన్నికల ప్రచారం కోసం ఏ నాయకుడికి బెయిల్ ఇవ్వలేదని ఈడీ ఫిడవిట్లో తెలిపింది. ఏ రాజకీయ నాయకుడు ప్రత్యేక హోదాను క్లెయిమ్ చేయలేరని, నేరాలకు పాల్పడితే ఇతర పౌరుల మాదిరిగానే రాజకీయ నాయకులను అరెస్టు చేయవచ్చని ఈడీ స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచారానికి మాత్రమే కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం సమానత్వ పాలనకు విరుద్ధమని దర్యాప్తు సంస్థ అఫిడవిట్లో పేర్కొంది.
మంగళవారం ఓ పిటిషన్పై విచారణ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అని.. అతడు సాధారణ నేరస్తుడు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇదిలా ఉండగా.. అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పు సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయనున్నారు. అరెస్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను అదే రోజు నిర్ణయం తీసుకోనున్నట్లు జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మార్చి 21న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో తిహార్ జైలులో ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వీలుగా ఢిల్లీ సీఎం మధ్యంతర బెయిల్ను కోరారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు విపించారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు బెయిల్ను వ్యతిరేకించారు.