Gujarat | అహ్మదాబాద్, డిసెంబర్ 15: గుజరాత్లో వేలాది మంది చిన్నారులు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న ఐదేండ్ల లోపు చిన్నారుల్లో నూట్రీషియన్ రిహాబిలిటేషన్ సెంటర్లలో(ఎన్ఆర్సీ) చేరే వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంటున్నది. గత మూడేండ్ల వ్యవధిలో 41,632 మంది చిన్నారులు ఎన్ఆర్సీలలో చేరారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
గత మూడేండ్ల వ్యవధిలో ఈ సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగించే అంశం. ఈ మేరకు లోక్సభలో ఎంపీలు అడిగిన ప్రశ్నకు ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది. ఐదేండ్ల లోపు చిన్నారుల్లో ఆరోగ్యపరమైన సమస్యలతో కూడిన పోషకాహార లోపంతో బాధపడుతున్న వారిలో 2020-21లో 29 రాష్ర్టాలు/యూటీల వ్యాప్తంగా 1.04 లక్షలుగా ఉన్నదని, ఇది 2022-23కి 1.89 లక్షలకు పెరిగిందని తెలిపింది.
గుజరాత్లో 2020-21లో 9,906గా ఉన్న ఈ సంఖ్య 2022-23కి రెట్టింపై 18,978కి చేరిందని పేర్కొన్నది. ఈ ఏడాది జూన్ వరకు 5,634 మంది నూట్రీషియన్ రిహాబిలిటేషన్ సెంటర్లలో చేరారు. గుజరాత్లో ఏడాటికి సగటున 12 లక్షల మంది చిన్నారులు జన్మిస్తారని, వీరిలో దాదాపు 30 వేల మంది నేటికి కూడా మరణిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి హిరేన్ బ్యాంకర్ విమర్శించారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే గత ఐదేండ్లలో 7 లక్షలకు మందికి పైగా పోషకాహారం లోపం సమస్య బారిన పడ్డారని పేర్కొన్నారు. కాగా, గుజరాత్లో 39 శాతం మంది చిన్నారులు వయసుకు తగ్గ బరువు లేరని ఎన్ఎఫ్హెచ్ఎస్-5 సర్వే పేర్కొన్నది.