హిజబ్ వ్యవహారం కర్నాటకను కుదుపేస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే హిజబ్ వ్యవహారంపై స్పందించారు. పాఠశాలల్లో యూనిఫారం కచ్చితంగా ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఆయా విద్యా సంస్థల్లో ముందుగానే నిర్ధారితమైన యూనిఫారమ్ను అందరూ ఫాలో కావాల్సిందేనన్నారు. విద్యా సంస్థల్లో కేవలం విద్యపైనే విద్యార్థులు తమ దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. రాజకీయాలు, మతపరమైన విషయాలు విద్యా సంస్థల గడప తాకకుండా జాగ్రత్తపడాలని ఆదిత్య థాకరే కోరారు .
ఇక హిజబ్ వివాదంపై కర్నాటక హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.దీనిపై బుధవారం ఏకసభ్య ధర్మాసనం విచారణ చేసింది. దీనిని పైకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ఏకసభ్య ధర్మాసనం ప్రకటించింది. ఇక గత రెండు రోజులుగా జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థల గేట్ల నుంచి 200 మీటర్ల పరిధిలో ఎలాంటి ఆందోళనలు నిర్వహించేందుకు వీల్లేదని, నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. రెండు వారాల పాటు ఈ నిషేధం అమలులో వుంటుందని ప్రభుత్వం పేర్కొంది.