బెంగళూరు, ఆగస్టు 30: సూర్యుడి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకునేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగిస్తున్న ఆదిత్య-ఎల్1 ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మిషన్ను నిర్వహించేందుకు ఇస్రో సిద్ధమైంది. తాజాగా బుధవారం ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగ లాంచ్ రిహార్సల్ విజయవంతం అయింది. దీంతో పాటు పీఎస్ఎల్వీ-సీ57 రాకెట్ అంతర్గత తనిఖీలు పూర్తయ్యాయి. ఈ మేరకు బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం వెల్లడించింది. వచ్చే నెల 2న ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఇస్రో సమాయత్తమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం దీనికి వేదిక కానున్నది. ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరంలోని లాగ్రేంజ్ పాయింట్ వద్దనున్న సుదీర్ఘమైన కక్ష్యలో ప్రవేశపెడతారు.