ISRO Sun Mission | బెంగళూరు/ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్-3తో జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంపై అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన ఇస్రో.. ఇక భానుడిపై దృష్టిసారించింది. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్-1ను ప్రయోగించనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగం జరగనున్నది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ ఇందుకు వేదిక కానున్నది. ఆదిత్య ఎల్-1 శాటిలైట్ను మోసుకుంటూ పీఎస్ఎల్వీ-సీ57 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనున్నది. ఇప్పటికే ప్రయోగ రిహార్సల్ విజయవంతం అవగా.. తాజాగా కౌంట్డౌన్ ప్రక్రియ కూడా మొదలైంది. 23.40 గంటల కౌంట్డౌన్ ప్రక్రియను ఇస్రో శుక్రవారం 12.10 గంటలకు ప్రారంభించింది. కౌంట్డౌన్ ముగిసిన వెంటనే సరిగ్గా ఉదయం 11.50 గంటలకు నిప్పులు చిమ్ముకుంటూ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనున్నది.
ఇదే మొదటి ప్రయోగం
సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణంపై అధ్యయనం చేసేందుకు ఇస్రో ప్రయోగిస్తున్న మొదటి శాటిలైట్ ఇదే కావడం విశేషం. దీన్ని భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని సూర్యుడు- భూమి లాగ్రేంజ్ పాయింట్-1 (ఎల్-1) వద్ద ఉండే సుదీర్ఘమైన దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెడతారు. అక్కడి చేరేందుకు సుమారు 125 రోజుల సమయం పడుతుంది. ఈ ఉపగ్రహం ద్వారా అతి దగ్గరి నుంచి సౌర వ్యవస్థపై నిఘా పెట్టవచ్చు. తద్వారా సౌర తుఫానులు, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయవచ్చు.
నిరంతర పర్యవేక్షణ…
ఆదిత్య-ఎల్1 ద్వారా సూర్యుడు, నక్షత్రాలు, పాలపుంత గురించి కీలకమైన విషయాలు తెలుసుకునే వీలు కలుగుతుంది. ఇందులో మొత్తం ఏడు పే లోడ్లు ఉంటాయి. వీటిలో నాలుగు పేలోడ్లు సూర్యుడిపై అధ్యయనం చేస్తాయి. మిగతా మూడు ఎల్-1 పరిధిలోని వాతావరణంపై అధ్యయనం చేస్తాయి. వీటిలో విజిబుల్ ఎమిషన్ లైన్ కొరొనాగ్రాఫ్ (వీఈఎల్సీ) పేలోడ్ అతి కీలకమైంది. దీని ద్వారా సూర్యుడి ఫొటోలు చిత్రీకరించవచ్చు. కొరొనల్ మాస్ ఎజెక్షన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. మరోవైపు ఎల్-1 పాయింట్ వద్ద ఈ శాటిలైట్ను ప్రవేశపెట్టడం వల్ల సూర్యుడిని నిరంతరం పర్యవేక్షించవచ్చు. సూర్యుడి నుంచి అంతరిక్షంలోకి వెలువడే పదార్థాలు కొన్నిసార్లు భూమివైపు దూసుకొస్తాయి. వీటి వల్ల శాటిలైట్లకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో పాటు వీటి వల్ల భూమికి ప్రమాదం పొంచి ఉంటే ముందే గుర్తించి వాటిని దారి మళ్లించే అవకాశం ఉంటుంది.
పేలోడ్లు ఇవీ..
పవర్ఫుల్ రాకెట్…
ఈ ప్రయోగానికి ఇస్రో వద్దనున్న పవర్ఫుల్ రాకెట్ పీఎస్ఎల్వీ-సీ57ను వినియోగిస్తున్నారు. పవర్ఫుల్ వేరియంట్ ‘ఎక్స్ఎల్ను దీని కోసం వాడుతున్నారు. ఈ వేరియంట్ను గతంలోనూ ఇస్రో వినియోగించింది. 2008లో నిర్వహించిన చంద్రయాన్-1 శాటిలైట్, 2013లో చేపట్టిన అంగారక ఆర్బిటర్ మిషన్లను ఈ వేరియంట్ సాయంతోనే నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టారు. మొదట ఆదిత్య-ఎల్1ను లో ఆర్బిట్లో ప్రవేశపెడతారు. తర్వాత ఇది మరింత దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి మారుతుంది. అనంతరం ఆన్బోర్డ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ను వినియోగించుకుని దీన్ని ఎల్1 పాయింట్లోకి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు 125 రోజుల వరకు పడుతుంది.
శ్రీవారి సేవలో ఇస్రో శాస్త్రవేత్తలు
ఆదిత్య-ఎల్1 ప్రయోగం విజయవంతం అవ్వాలని కోరుతూ ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీవారిని వేడుకున్నారు. తిరుమలలో శుక్రవారం ఇస్రో శాస్త్రవేత్తల బృందం శ్రీవేంకటేశ్వరస్వామి సేవలో పాల్గొన్నారు. ఆదిత్య-ఎల్1 శాటిలైట్ మినియేచర్ను వెంట తీసుకెళ్లిన శాస్త్రవేత్తలు.. ఉదయం శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆదిత్య-ఎల్1 మిషన్ విజయవంతం కావాలని ప్రార్థించారు. దాదాపుగా కౌంట్డౌన్ ఆరంభమైన సమయంలోనే వారు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలకు వచ్చిన ఇస్రో శాస్త్రవేత్తలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. వేదాశీర్వచనాలను పలికారు. శేష వస్త్రాలను బహూకరించారు.
నిమిషానికో ఫొటో!
ఆదిత్యుడిపై అధ్యయనం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ఆదిత్య-ఎల్1 ప్రయోగానికి సర్వం సిద్ధం అయింది. ఈ మిషన్ కౌంట్డౌన్ ప్రక్రియ సైతం శుక్రవారం మొదలైంది. సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు ప్రయోగిస్తున్న ఆదిత్య-ఎల్1 శాటిలైట్లో మొత్తం ఏడు పేలోడ్లు ఉంటాయి. వీటిలో విజిబుల్ ఎమిషన్ లైన్ కొరొనాగ్రాఫ్ (వీఈఎల్సీ) పేలోడ్ మొదటిది. ఇదే ఈ మిషన్లో అతి కీలకమైనదని.. దీన్ని రూపొందించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఏ) శాస్త్రవేత్తలు వెల్లడించారు. వీఈఎల్సీకి పేలోడ్ నిమిషానికో ఫొటో చొప్పున 24 గంటల్లో 1,440 చిత్రాలను పంపుతుందని వారు తెలిపారు. సూర్యుడిపై అధ్యయనం ద్వారా ఇతర నక్షత్రాలు, పాలపుంత సంబంధిత కీలక విషయాలను తెలుసుకోవచ్చని వారు పేర్కొన్నారు.