బెంగళూరు, సెప్టెంబర్ 15: సూర్యుడి గుట్టు విప్పేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన ఆదిత్య-ఎల్1 లక్ష్యం దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. తాజాగా ఇస్రో శుక్రవారం నిర్వహించిన నాలుగో భూ కక్ష్య పెంపు ప్రక్రియ విజయవంతమైంది. ప్రస్తుతం ఆదిత్య-ఎల్1 శాటిలైట్ 256 x 1,21,973 కిలోమీటర్ల కక్ష్యలో తిరుగుతున్నది. ఈ మేరకు ఇస్రో ఎక్స్ వేదికగా వెల్లడించింది.
మొత్తం ఐదు భూ కక్ష్య పెంపు ప్రక్రియల్లో ఇప్పటికే నాలుగు పూర్తయ్యాయి. ఈ నెల 3న మొదటి భూ కక్ష్య పెంపు ప్రక్రియ, 5న రెండోది, 10న మూడో కక్ష్య పెంపు ప్రక్రియ పూర్తయింది. తాజాగా శుక్రవారం నాలుగో ప్రక్రియ కూడా పూర్తయింది. చివరిదైన ఐదో భూ కక్ష్య పెంపు ప్రక్రియ పూర్తయ్యాక శాటిలైట్ భూ కక్ష్యను వీడి ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ప్రవేశిస్తుంది. అనంతరం సుదీర్ఘ ప్రయాణం తర్వాత 15 లక్షల కిలో మీటర్ల దూరంలోని ఎల్-1 పాయింట్కు శాటిలైట్ చేరుకోనున్నది.