కోల్కతా : విపక్ష ఇండియా కూటమిలో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై(Mamata Banerjee) కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. కోల్ స్కామ్ కేసులో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి ఈడీ సమన్లు జారీ చేసిన ఉదంతంపై అధీర్ దీదీపై విరుచుకుపడ్డారు.
తన మేనల్లుడిని ఈడీ, సీబీఐ వేధించినప్పుడే ఆమె నోరు మెదుపుతారని, ఇతర విపక్ష నేతలను కేంద్ర దర్యాప్తు సంస్ధలు వేధించినప్పుడు మాత్రం సానుభూతి చూపరని అన్నారు. ముర్షిదాబాద్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధిర్ రంజన్ దీదీపై విమర్శలు గుప్పించారు. టీఎంసీ ఎంపీ నుస్రత్ జహన్కు కూడా ఈడీ సమన్లు జారీ చేసిందని, అయితే తన మేనల్లుడికి కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు సమన్లు జారీ చేసినప్పుడే ఆమె గగ్గోలు పెడతారని అన్నారు.
అభిషేక్ను వేధించినప్పుడే ఆమె స్పందిస్తారని కాంగ్రెస్ నేత దుయ్యబట్టారు. కోట్లాది రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయనే ఆరోపణలపై లీప్స్ అండ్ బౌండ్స్ ప్రైవేట్ లిమిటెడ్పై ఈడీ దాడులు చేపట్టిన అనంతరం టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి దర్యాప్తు సంస్ధ సమన్లు జారీ చేసింది. ఈ కంపెనీకి అభిషేక్ సీఈవోగా వ్యవహరిస్తున్నారని ఈడీ వెల్లడించింది.కాగా ఈడీ విచారణకు తాను సహకరిస్తానని అభిషేక్ బెనర్జీ తెలిపారు.