కోల్కతా : గోవా అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ సారధ్యంలోని టీఎంసీ పోటీ చేయడం బీజేపీకి ఉపకరించిందని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధరి అన్నారు. మమతా బెనర్జీ బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆమె బీజేపీ ఏజెంట్ అని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కాంగ్రెస్కు 700 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, విపక్ష ఓట్లలో 20 శాతం కాంగ్రెస్ కైవసం చేసుకుందని చెప్పారు.
బీజేపీకి వత్తాసుగా దీదీ ఇప్పుడు పలు విషయాలు చెబుతున్నారని మండిపడ్డారు. బెంగాల్ విద్యార్ధి నేత అనిష్ ఖాన్ హత్యను నిరసిస్తే జరిగిన ధర్నాలో అధీర్ రంజన్ పాల్గొన్నారు. మమతా బెనర్జీకి జాతీయ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర లేదని అన్నారు. ఆమె కొన్ని సార్లు ఈవీఎంలపై నెపం మోపితే మరికొన్ని సార్లు కాంగ్రెస్ను నిందిస్తారని మండిపడ్డారు.
మమతా బెనర్జీ కాంగ్రెస్ను నిందించడం మాని సొంతగా ప్రధాని కావడంపై దృష్టి సారించాలని హితవు పలికారు. గోవాలో తొలిసారి టీఎంసీ పోటీచేయడాన్ని అధిర్ రంజన్ ప్రస్తావిస్తూ బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకే టీఎంసీ గోవాలో పోటీ చేసిందని..కాంగ్రెస్ను ఓడించి బీజేపీ దగ్గర మార్కులు కొట్టేసిందని మండిపడ్డారు. గోవాలో కాంగ్రెస్ అవకాశాలను మమతా బెనర్జీ దెబ్బతీశారని ప్రతిఒక్కరికీ తెలుసునని అన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఎన్ని స్ధానాల్లో గెలిచిందని ఆయన ప్రశ్నించారు.