Election Commissioners | త్వరలో ఎన్నికల కమిషన్లో ఇద్దరు కొత్త కమిషనర్లు నియామకమయ్యే అవకాశం ఉన్నది. ఈ నెల 15న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సెలక్షన్ కమిటీ సమావేశం జరుగనున్నది. కమిషనర్ల నియామకం తర్వాత సార్వత్రిక ఎన్నికల నగారా మోగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎన్నికలకు నోటిఫికేషన్ మరో ఐదారు రోజులు పడుతుందని పేర్కొన్నాయి. సెలక్షన్ కమిటీ సమావేశానికి ముందు లోక్సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదర్ న్యాయశాఖ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. ఎలక్షన్ కమిషనర్ పదవికి ఎంపిక చేసిన అభ్యర్థుల బయోడేటాతో వివరాలను పంపాలని మంత్రిత్వ శాఖను కోరారు.
ఎలక్షన్ కమిషనర్ పదవికి ఎంపిక చేసిన అభ్యర్థుల సమాచారాన్ని శాసనసభ శాఖ కార్యదర్శి రాజీవ్ మణికి రాసిన లేఖలో కాంగ్రెస్ నేత కోరారు. ఈసీల నియామకానికి సీవీసీ, సమాచార కమిషనర్లతో సహా ఇతర ఉన్నతాధికారుల నియామకానికి సంబంధించి విధానాన్ని అనుసరించాలని న్యాయమంత్రిత్వ శాఖ అధికారులను సూచించారు. సీఐసీ, సీవీసీ ఎంపికకు ప్రధాని నేతృత్వంలోని కమిటీలో ప్రతిపక్ష నేత సైతం సభ్యుడిగా ఉంటారు. ఈ నెల 14న మధ్యాహ్నం 12 గంటలకు ఇద్దరు ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసేందుకు హైపవర్ ప్యానెల్ సమావేశం జరుగుతుందని సమాచారం.
కమిటీ ఏకాభిప్రాయం లేదంటే మెజారిటీ ఆధారంగా ఇద్దరి పేర్లను కమిషనర్లుగా నిర్ణయించి రాష్ట్రపతికి సిఫారసు చేయనున్నారు. అనంతరం నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ను రాష్ట్రపతి అధికారికంగా విడుదల చేస్తారు. మొన్నటి వరకు ఎన్నికల కమిషనర్లుగా అనుప్ చంద్రపాండే, అరుణ్ గోయల్ కొనసాగారు. ఫిబ్రవరి 14 నాటికి 65 సంవత్సరాలు పూర్తికావడంతో అనుప్ చంద్రపాండే పదవీ విరమణ చేశారు. అరుణ్ గోయల్ ఇటీవల ఆకస్మికంగా రాజీనామా చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్లో ప్రస్తుతం సీఈసీ రాజీవ్కుమార్ మాత్రమే మిగిలారు.