మొన్న హిండెన్బర్గ్.. నిన్న క్రెడిట్ సూసీ.. నేడు సిటీ బ్యాంక్.. గోరు చుట్టుపై రోకలి పోటులా తయారైంది అదానీ గ్రూప్ పరిస్థితి.
ఒకదాని వెనుక మరొకటి గౌతమ్ అదానీ కంపెనీలకు షాక్ ఇస్తున్నాయి మరి. క్రెడిట్ సూసీకితోడు సిటీ గ్రూప్.. అదానీ కంపెనీల సెక్యూరిటీలకు ఆమోదాన్ని ఆపేసింది.
మోసం జరిగిందన్న ఆరోపణలతో ఇప్పటికే నెలల తరబడి పెరిగిన సంపద కాస్తా.. రోజుల్లో ఆవిరైపోతున్నది. ఇప్పుడిలా కొత్త రుణాలు పుట్టకుండా అన్ని దారులూ మూసుకుపోతున్నాయి.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: అదానీ గ్రూప్ కష్టాలు తీవ్రమయ్యేలా కనిపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లలో షేర్ల పతనం.. రూ.20,000 కోట్ల ఎఫ్పీవో రద్దుతోనే గ్రూప్ సంక్షోభం ఆగేలా లేదు. హిండెన్బర్గ్ ప్రకంపనలు ప్రపంచవ్యాప్తం గా తాకాయి మరి. ఈ క్రమంలోనే ఇప్పుడు అమెరికా బ్యాంకింగ్ దిగ్గజం సిటీ గ్రూప్.. అదానీ గ్రూప్ సంస్థలకు రుణాలను ఆపేసింది. ఇప్పటికే స్విట్జర్లాండ్ రెండో అతిపెద్ద బ్యాంక్ క్రెడిట్ సూసీ.. అదానీ గ్రూప్ బాండ్ల విలువ సున్నా అని ప్రకటించింది. మార్జిన్ లోన్ల కోసం ఈ బాం డ్లను అంగీకరించవద్దని తమ ప్రైవేట్ బ్యాంకింగ్ క్లయింట్లకూ చెప్పింది. తాజాగా సిటీ గ్రూప్ సైతం అదానీ కంపెనీల సెక్యూరిటీలను ఆమోదించడాన్ని నిలిపేసింది.
‘కొద్ది రోజులుగా అదానీ సెక్యూరిటీల ధర గణనీయం గా పడిపోతుండటాన్ని చూస్తున్నాం. గ్రూప్ ఆర్థిక పరిస్థితులు బాగాలేవంటూ వస్తున్న వార్తలతో స్టాక్స్, బాండ్ల ధరలు క్షీణిస్తున్నాయి. అందుకే అన్ని అదానీ గ్రూప్ కంపెనీలిచ్చిన సెక్యూరిటీలకున్న రుణ విలువను తొలగిస్తు న్నాం’ అని తాజా నివేదికలో సిటీ గ్రూప్ ప్రకటించింది.
ఎప్పుడైతే ఓ ప్రైవేట్ బ్యాంక్.. బాండ్ల రుణ విలువను ‘శూన్య’ స్థాయికి తీసుకెళ్తుందో అప్పుడు క్లెయింట్లు సాధారణంగానే వాటిని నగదుగా మార్చుకోవడానికి లేక ఇతరత్రా తాకట్టు రూపాల్లోనో పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇందులో వారు విఫలమైతే తమ సెక్యూరిటీలను అమ్మేసుకుంటారు. ఫలితంగా కంపెనీ ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులయ్యే ప్రమాదం ఉంటుందని మార్కె ట్ నిపుణులు చెప్తున్నారు. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై అమ్మిన బాండ్ల విలువ ‘శూన్యం’ అని బుధవారం క్రెడిట్ సూసీ చెప్పింది.
అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణలపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీతో ఎప్పటికప్పుడు కేంద్రం మాట్లాడుతున్నట్టు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సెబీ నివేదిక కోసం చూస్తున్నట్టు పేర్కొన్నారు. షేర్లు ఇటీవల ఎందుకంత నష్టాలను చూస్తున్నాయని, హిండెన్బర్గ్ చెప్పినట్టు అవకతవకలు జరిగా యా? అనే అంశంలో సెబీ దృష్టి పెట్టినట్టు తెలిపారు.
అదానీ అండ్ కో ఆస్తులను కేంద్రం జాతీయం చేయాలి. అనంతరం వాటిని విక్రయించాలి. ఈజీగా పైకి వచ్చినవాళ్లు అంతే ఈజీగా పడిపోతారు.
-బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి