Actress Kajal | సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయరంగ ప్రవేశం చేశారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎందరో సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో మరో నటి సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఆమె కాజల్ నిషాద్. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్ఫూర్ స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ టికెట్పై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకు ముందు సినీరంగంలో రాణించింది.
కాజల్ నిషాద్ గుజరాత్లోని కచ్లో జన్మించింది. అయితే, సినిమాలు, టీవీ షోల్లో పని చేసేందుకు ముంబయికి వచ్చింది. 2009లో ‘లపతగంజ్’ షోలో ‘చమేలీ’ పాత్రతో కెరీర్ను ప్రారంభించింది. ఆ తర్వాత భోజ్పురి సినిమాల వైపు దృష్టి సారించింది. ‘షాదీ బయా’ చిత్రంలోనూ నటించింది. ‘తోటా వెడ్స్ మైనా’లో రామ్ కటోరీ ఆంటీ పాత్రతో ప్రేక్షకుల మన్ననలు పొందింది. కలర్స్ షో ‘ఇష్క్ కా రంగ్ సఫేద్’లో కనక్ త్రిపాఠి పాత్రలోనూ మెప్పించింది.
భోజ్పురి చిత్ర నిర్మాత సంజయ్ నిషాద్ని వివాహం చేసుకున్నది. సంజయ్ యూపీలోని గోరఖ్పూర్లోని భౌవాపర్ నివాసి. కాజల్ తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్తో మొదలుపెట్టింది. ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీలో కొనసాగుతున్నది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్పూర్ రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్పై కాజల్ తొలిసారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నది.
ఆ సమయంలో ఓటమిపాలైంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ కాజల్ నిషాద్ను కాపియర్గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి తన అభ్యర్థిగా నిలబెట్టింది. బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఫతే బహదూర్ సింగ్ చేతిలో ఓడిపోయింది. 2023లో జరిగిన పౌర ఎన్నికల్లో గోరఖ్పూర్ మేయర్ పదవి ఇచ్చేందుకు ఎస్పీ సిద్ధం కాగా.. కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఓటమి పాలైంది. తాజాగా గోరఖ్పూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు రెడీ అయ్యింది.