లక్నో: ఉత్తరప్రదేశ్లోని గోరఖ్నాథ్ ఆలయం వద్ద దాడికి పాల్పడిన నిందితుడు అహ్మద్ ముర్తజా అబ్బాసీ విరిగిన చేతులకు ఆపరేషన్ విజయవంతమైనట్లు వైద్యులు తెలిపారు. నిందితుడి విరిగిన రెండు చేతులకు రాడ్లు వేసినట్లు గోరఖ్పూర్లోని సదర్ హాస్పిటల్ డాక్టర్ రాకేష్ కుమార్ తెలిపారు. అబ్బాసీ ప్రభుత్వం ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడని, 8-10 రోజులు పరిశీలనలో ఉంచుతామని చెప్పారు.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మఠాధిపతిగా ఉన్న గోరఖ్నాథ్ ఆలయం వద్ద ముస్లిం వ్యక్తి ఈ నెల ఆరంభంలో హంగామా సృష్టించాడు. గోరఖ్పూర్ నివాసి అయిన అహ్మద్ ముర్తజా అబ్బాసీ ఈ నెల 3న ఆదివారం రాత్రి 7 గంటలకు గోరఖ్నాథ్ ఆలయం వద్దకు వచ్చాడు. మతపరమైన నినాదాలు చేస్తూ ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు.
ఆలయం వద్ద సెక్యూరిటీగా ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. అబ్బాసీని అడ్డుకోబోగా తన వద్ద ఉన్న కొడవలితో పోలీసులు, స్థానికులపై దాడికి యత్నించాడు. దీంతో అక్కడున్న వారు భయాందోళన చెందారు. కొందరు అతడిపైకి ఇటుకలను విసిరారు. చివరకు అబ్బాసీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న ల్యాప్టాప్, మొబైల్ ఫోన్, టికెట్తో ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో అబ్బాసీతోపాటు ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.
కాగా, ముర్తజా అబ్బాసీ ఇటీవల ముంబై నుంచి గోరఖ్పూర్కు తిరిగి వచ్చాడని ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. గోరఖ్నాథ్ ఆలయంలోకి ప్రవేశించి భక్తులపై దాడి చేసేందుకు అతడు కుట్ర పన్నాడని ఆరోపించారు. ఇది ఉగ్రవాద దాడి కావచ్చని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ముంబైలో అతడి కార్యకలాపాలపై దర్యాప్తు కోసం నాలుగు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
మరోవైపు ఐఐటీ బాంబేలో విద్యనభ్యసించిన అహ్మద్ ముర్తజా అబ్బాసీ, 2015లో కెమికల్ ఇంజినీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అయితే 2017 నుంచి అబ్బాసీ మానసిక పరిస్థితి సరిగా లేదని ఆయన తండ్రి మహ్మద్ మునీర్ తెలిపారు. భార్యను వదిలేసి ఒంటరిగా ఉంటున్నాడని చెప్పారు. అహ్మదాబాద్తో పాటు పలు నగరాల్లో అతడు చికిత్స పొందాడని మీడియాతో అన్నారు.
కాగా, అబ్బాసీ తండ్రి మహ్మద్ మునీర్ అనేక ఫైనాన్స్ కంపెనీలకు న్యాయ సలహాదారుగా ఉన్నారు. ఆయన సోదరుడు వైద్యుడు. గోరఖ్పూర్లోని అబ్బాసీ హాస్పిటల్ యజమాని.