Parliament | న్యూఢిల్లీ/కోల్కతా, డిసెంబర్ 16: పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. లోక్సభలో గ్యాలరీ నుంచి సభా మందిరంలోకి దూకి పొగ వదిలిన నిందితులు.. వాస్తవానికి వేరే ప్లాన్లు కూడా వేశారని ఢిల్లీ పోలీసు వర్గాలు శనివారం పేర్కొన్నాయి. ఒంటికి నిప్పంటించుకోవడం, సభలో కరపత్రాలు విసిరేయడం వంటివి చేయాలని అనుకొన్నారని, అయితే బుధవారం జరిగిన ఘటననే తుది ప్లాన్గా అమలు చేశారని తెలిపాయి. ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ నిందితులు సంచలన చర్య ద్వారా ప్రభుత్వానికి ఒక బలమైన సందేశం ఇవ్వాలని అనుకొన్నారని పేర్కొన్నారు. ఒంటికి ఫైర్ ప్రూఫ్ జెల్ను పూసుకొని నిప్పంటించుకోవడం లేదా కరపత్రాలను విసరడం వంటివి చేయాలని నిందితులు భావించారని వెల్లడించారు. ఈ విషయాలను నిందితులు విచారణలో చెప్పారని పేరు చెప్పేందుకు ఆ అధికారి తెలిపారు.
ఢిల్లీ పోలీసులు మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా స్టేట్మెంట్ను కూడా రికార్డు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇద్దరు నిందితులకు ఎంపీ కార్యాలయం నుంచే పార్లమెంట్ విజిటర్ పాస్లు అందినట్టు ప్రాథమికంగా వెల్లడైన విషయం తెలిసిందే. మరోవైపు దర్యాప్తు భాగంగా అధికారులు నిందితులను వారు గతంలో కలిసిన పలు ప్రాంతాలకు తీసుకెళ్లారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝాను ఢిల్లీ నుంచి పారిపోయిన తర్వాత ఆశ్రయం తీసుకొన్న రాజస్థాన్లోని నాగౌర్కు తీసుకెళ్లనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తనతో పాటు ఇతర నిందితుల ఫోన్లను ధ్వంసం చేసిన ప్రాంతానికి తీసుకెళ్తామని పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా, ఈ నెల 13న జరిగిన భద్రతా ఉల్లంఘన ఘటన సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసేందుకు ఢిల్లీ పోలీసులు పార్లమెంట్ అనుమతి కోరనున్నారని తెలుస్తున్నది.
మరోవైపు ఈ కేసులో ఢిల్లీ పోలీసులు శనివారం అరో వ్యక్తిని అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపర్చగా.. న్యాయమూర్తి అతడిని 7 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించారు. లలిత్ ఝా ఢిల్లీ నుంచి పారిపోవడంలో సహకరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహేశ్ను కస్టడీలోకి తీసుకొన్నామని వెల్లడించారు.
మరోవైపు ‘ఇండియాకు ఇప్పుడు ఒక బాంబు కావాలి. దౌర్జన్యం, అరాచకత్వం, అన్యాయాలకు వ్యతిరేకంగా ఒక బలమైన గొంతుక కావాలి’ అంటూ లలిత్ ఝా అక్టోబర్ 26న సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ను ఢిల్లీ పోలీసులు వెలికితీశారు. అతడి సోషల్ మీడియా ఖాతా నిండా ఇలాంటి రెచ్చగొట్టే పోస్టులు ఉన్నాయని తెలిసింది. అయితే తన కొడుకు ఇలాంటి నేరాలకు పాల్పడడని లలిత్ఝా తండ్రి దేవానంద్ అన్నారు. మరో నిందితురాలు నీలం తల్లిద్రండులు ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని కోరుతూ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ వేశారు.
లలిత్ఝాకు టీఎంసీ యూత్ వింగ్తో సంబంధాలు ఉన్నాయని పశ్చిమబెంగాల్ ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి శనివారం ఆరోపించారు. ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు సహా పలువురు టీఎంసీ నేతలు, ఆ పార్టీ యువ నేతలతో లలిత్ ఝా కలిసి దిగిన ఫొటోలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే సువేందు ఆరోపణలు టీఎంసీ కొట్టిపారేసింది.
పార్లమెంట్ ఘటన నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓంబిర్లా ఎంపీలకు లేఖ రాశారు. ఇది దురదృష్టకర ఘటన అని పేర్కొన్నారు. ఘటనపై ఆ రోజునే అన్ని పార్టీల నేతలతో సమావేశమయ్యానని, భద్రతా చర్యల బలోపేతంపై సలహాలు తీసుకొన్నామని తెలిపారు. లోతుగా దర్యాప్తు చేసేందుకు ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పలువురు ఎంపీల సస్పెన్షన్కు, భద్రతా ఉల్లంఘన ఘటనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ రెండింటికీ మధ్య లింక్ పెట్టేందుకు పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రయత్నించడం దురదృష్టకరమని, సభ పవిత్రతను కాపాడేందుకే తాను ఆ నిర్ణయం తీసుకొన్నానని స్పీకర్ ఓంబిర్లా లేఖలో చెప్పారు.