చండీగఢ్: హర్యానాలోని నూహ్ జిల్లాలో ఇటీవల జరిగిన హింసాకాండలో (Haryana violence) పాల్గొన్న నిందితులు, ఆ రాష్ట్ర పోలీసుల మధ్య గురువారం ఎన్కౌంటర్ జరిగింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తికి బుల్లెట్ గాయాలయ్యాయి. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జూలై 31న నూహ్ జిల్లాలో వీహెచ్పీ చేపట్టిన మతపరమైన యాత్ర హింసకు దారి తీసింది. ఇద్దరు హోంగార్డులతో సహా ఆరుగురు మరణించిన ఈ హింసాత్మక సంఘటనల్లో పాల్గొన్న ఇద్దరు నిందితులైన మున్సీద్, సాయికుల్ రాజస్థాన్కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.
కాగా, గురువారం ఆ ఇద్దరు నిందితులు నూహ్కు 16 కిలోమీటర్ల దూరంలోని తావడ్కు వెళ్తున్నట్లు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా నిందితులు కాల్పులు జరుపగా ప్రతిగా పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో సాయికుల్ కాలికి బుల్లెట్ గాయమైంది. దీంతో అతడ్ని అరెస్ట్ చేశారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తప్పించుకున్న మరో నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు.