జైసల్మేర్: మితిమీరిన వేగం మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. మద్యం మత్తు తీవ్ర అనర్థం మిగిల్చింది. రీల్స్పై మోజు కొంప ముంచింది. మద్యం మత్తులో ఇన్స్టా రీల్స్ చేసుకుంటూ కారులో హైస్పీడ్లో దూసుకొచ్చిన నలుగురు యువకులు బీభత్సం సృష్టించారు. క్షణాల్లో నలుగురి ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. రాజస్థాన్ రాష్ట్రం జైసల్మేర్ నగరంలో ఈ ఘోరం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి నలుగురు యువకులు పూటుగా మద్యం సేవించి, ఇన్స్టారీల్స్ చేసుకుంటూ కారులో వేగంగా దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు దాటుతున్న 13 ఏళ్ల బాలులు మనీష్ను, అతని తల్లి మెంకాలాను బలంగా డీకొట్టారు. కారు అదుపు తప్పడంతో రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఓ వ్యాన్ను ఢీకొట్టి, అక్కడే ఉన్న ఆవును గుద్దారు.
ఈ ఘటనలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు దాటుతున్న తల్లీకొడుకు, కారులోని ఇద్దరు యువకులు భవానీ సింగ్, రోషన్ ఖాన్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. స్వల్పగాయాలతో ప్రాణాలు దక్కించుకున్న కారులోని మరో ఇద్దరు యువకులు పారిపోయారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.