Chandrababu | స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో రాజమండ్రి జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) జ్యుడీషియల్ రిమాండ్ను (Judicial remand) కోర్టు పొడిగించింది. ఈ నెల 24 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ న్యాయమూర్తి (ACB court) తీర్పునిచ్చారు. స్కిల్ స్కాం కేసులో అరెస్టయిన చంద్రబాబుకు ఈ నెల 11న ఏసీబీ కోర్టు నేటి వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. నేటితో అది ముగియనుండటంతో రాజమండ్రి జైలులో నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జైలులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ బాబును న్యాయమూర్తి ప్రశ్నించారు. మరో రెండు రోజులు రిమాండ్లోనే ఉండాల్సి ఉంటుందంటూ వెల్లడించారు. చట్టం అందరికీ సమానమేనని, మీపై ఆరోపణలు మాత్రమే వచ్చాయని దర్యాప్తులో అన్ని విషయాలు తేలుతాయన్నారు. రిమాండ్ను శిక్షగా భావించొద్దని, ఇది చట్టప్రకారం జరుగుతున్న కార్యక్రమమని స్పష్టం చేశారు.
సీఐడీ కస్టడీపై మరికాసేపట్లో కోర్టు తీర్పు వెలువరించనున్నారు. బుధవారమే ఈ కేసులో వాదనలు పూర్తికాగా తీర్పు గురువారానికి వాయిదా పడింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఉండడంతో తీర్పును శుక్రవారానికి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వాయిదా వేసిన విషయం తెలిసిందే. క్వాష్ పిటిషన్ శుక్రవారం హైకోర్టులో లిస్ట్ అయితే తీర్పు వాయిదా వేస్తామని, కాకుంటే తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి తెలిపారు. అమరావతి రింగురోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో సీఐడీ వేసిన పీటీ వారెంట్లపై నేడు విచారణ చేపట్టనున్నట్టు కోర్టు పేర్కొంది.