శ్రీనగర్: జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో టీవీ సీరియల్ షూటింగ్ జరిగింది. మాజీ సీఎం, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా దీనిపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యం, చట్టసభకు ఇది అవమానమని, చాలా సిగ్గుచేటని విమర్శించారు. హుమా ఖురేషి నటించిన హిందీ టీవీ సీరియల్ ‘మహారాణి’ షూటింగ్ గత ఏడాది జూన్లో జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో జరిగింది. 1990లో బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణం కేసులో కూరుకుపోయారు. దీంతో తన రాజకీయ వారసురాలిగా భార్య రబ్రీ దేవిని నియమించడంతోపాటు ఆమెను సీఎం చేశారు. బీహార్లో జరిగిన ఈ రాజకీయ పరిణామాల ఆధారంగా ‘మహారాణి’ పేరుతో టీవీ సీరియల్ చిత్రీకరించారు.
కాగా, జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో ‘మహారాణి’ టీవీ సీరియల్ షూటింగ్కు సంబంధించిన ఫొటోలను మాజీ సీఎం, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా ఎక్స్లో శుక్రవారం షేర్ చేశారు. దీనికి అనుమతించిన జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగంపై ఆయన మండిపడ్డారు. ‘ప్రజాస్వామ్య తల్లి’ నిజమైన ముఖం. ఒకప్పుడు అన్ని పార్టీలు, మతాల నేపథ్యమున్న జమ్ముకశ్మీర్కు చెందిన ఎన్నికైన ప్రజాప్రతినిధులు చాలా ముఖ్యమైన చట్టాల్ని ఇక్కడ రూపొందించారు. ఇప్పుడు నటీనటులు, ఎక్స్ట్రాలు దీనిని (అసెంబ్లీ) టీవీ డ్రామాలకు సెట్గా ఉపయోగిస్తున్నారు’ అని విమర్శించారు. అలాగే ఒకప్పుడు సీఎంగా తాము కూర్చొని పరిపాలించిన ప్రజాస్వామ్య చిహ్నాన్ని బీజేపీ పాలనా యంత్రాంగం ఈ స్థితికి దిగజార్చడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ‘నేను ఆరేళ్ల పాటు సీఎంగా ఉన్న కార్యాలయంలో ఒక నకిలీ సీఎం కనిపించడం ఎంత అవమానకరం’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు 2018 జూన్ 20న నాటి సీఎం మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతును బీజేపీ వెనక్కి తీసుకుంది. ఆమె ప్రభుత్వం మైనార్టీలో పడిపోవడంతో 2018 డిసెంబర్ 20న అసెంబ్లీని రద్దు చేసి గవర్నర్ పాలన అమలు చేశారు. 2019 ఆగస్ట్ 5న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అలాగే జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేసింది. నాటి నుంచి జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించకపోవడంతో లెఫ్ట్నెంట్ గవర్నర్ నేతృత్వంలో పరిపాలన కొనసాగుతున్నది.
— Omar Abdullah (@OmarAbdullah) January 12, 2024