న్యూఢిల్లీ: ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) ఖాతాల్లో 10.34 కోట్ల ఖాతాలు నిష్ప్రయోజనంగా మిగిలిపోయాయని కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. వీటిలో 4.93 కోట్ల ఖాతాలు మహిళలకు చెందినవని తెలిపింది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను కేంద్ర మంత్రి భగవత్ కే కరద్ లిఖితపూర్వకంగా తెలిపారు.
బ్యాంకుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం, డిసెంబరు 6నాటికి 51.11 కోట్ల జన్ ధన్ ఖాతాలు ఉన్నాయని, వీటిలో దాదాపు 20 శాతం అంటే, 10.34 కోట్ల ఖాతాల్లో లావాదేవీలు జరగడం లేదని చెప్పారు. బ్యాంకింగ్ రంగంలో ఈ విధంగా లావాదేవీలు లేని ఖాతాలు కూడా దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయన్నారు. లావాదేవీలు లేని జన్ ధన్ ఖాతాల్లో రూ.12,779 కోట్లు ఉందని చెప్పారు. ఈ సొమ్ముకు యథావిధిగానే వడ్డీ చెల్లిస్తారని, ఖాతాను పునఃప్రారంభించిన తర్వాత ఈ సొమ్మును, వడ్డీని ఖాతాదారులు తీసుకోవచ్చునని చెప్పారు.