ద్వారక: గుజరాత్లోనూ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయని ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గాధ్వి ధీమా వ్యక్తంచేశారు. ఇవాళ ద్వారకలో ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన.. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ పోటీలోనే లేదని, కాబట్టి భారీ మెజారిటీతో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు ఖాయమని ఆయన చెప్పారు.
గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీకి బీ టీమ్లా పనిచేస్తున్నదని ఆరోపించారు. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రివాల్ ఇచ్చిన పిలుపుపై కూడా గాధ్వి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీలుస్తుందని, ఆ పార్టీ అభ్యర్థులు గెలిచినా తిరిగి బీజేపీలోకి వెళ్లిపోతారని, అందుకే కేజ్రివాల్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దని పిలుపునిచ్చారని ఆయన చెప్పారు.
గుజరాత్ ప్రజలకు అరవింద్ కేజ్రివాల్పై ఆపారమైన నమ్మకం ఉన్నదని ఇసుదాన్ గాధ్వి పేర్కొన్నారు. ఆప్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరెంటు సమస్య తీరుతుందని, మంచి ఆరోగ్య, విద్యా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ప్రజలు విశ్వసిస్తున్నారని గాధ్వి చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.