Republic Day | న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం ఆయా రాష్ట్రాలు తమ రాష్ట్ర ప్రగతి, సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రను తెలియజేసే విధంగా శకటాలను రూపొందించడం సహజమే. అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన శకటాలకు మాత్రమే పరేడ్లో పాల్గొనేందుకు అనుమతిస్తారు. ప్రతి ఏడాది కొన్ని రాష్ట్రాల శకటాలు తిరస్కరణకు గురవుతూనే ఉంటాయి. అలా ఈసారి కూడా ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన శకటాలను కేంద్రం తిరస్కరించింది. దీంతో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీ, సరిహద్దు రాష్ట్రం పంజాబ్లో అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వంపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు.
గత మూడేండ్ల నుంచి ఢిల్లీ ప్రభుత్వ శకటాన్ని కేంద్రం తిరస్కరిస్తూ వస్తుందని సౌరభ్ భరద్వాజ్ పేర్కొన్నారు. చివరిసారిగా 2021లో ఢిల్లీ శకటం ప్రదర్శించబడిందని తెలిపారు. అప్పుడు షాజహానబాద్ పునర్ నిర్మాణ ప్రాజెక్టును ప్రదర్శించినట్లు తెలిపారు. ఇప్పుడు ఢిల్లీలోని పాఠశాలలు, మొహల్లా క్లినిక్ల పనితీరు, అభివృద్ధిని ప్రదర్శించాలని అనుకున్నామని, అదే విషయాన్ని కేంద్రానికి తెలియజేశామని ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. కానీ ఈ శకట ప్రదర్శనకు వీల్లేదని కేంద్రం తిరస్కరించిందని ఆయన మండిపడ్డారు. ఇక పంజాబ్ శకటాన్ని కూడా కేంద్రం తిరస్కరించిందని సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. ఆప్పై కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. బీజేపీ పాలిత రాష్ట్రాల శకటాలకు మాత్రమే కేంద్రం అనుమతిస్తోందని దుయ్యబట్టారు.