న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఢిల్లీ అధికార పార్టీ ఆప్ (AAP) తన బలాన్ని చాటుకోవడానికి సన్నద్ధమవుతున్నది. పంజాబ్లో అధికారాన్ని దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. గోవాలో కూడా అధికార బీజేపీకి గత ఎన్నికల్లో గట్టిపోటీనిచ్చింది. ఈ దఫా ఎలాగైనా సీఎం సీటును సొంతం చేసుకోవాలని చూస్తున్నది. ఈక్రమంలో బలమైన నేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి కసరత్తు పూర్తిచేసింది. ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రివాల్ గోవా సీఎం అభ్యర్థిని బుధవారం ప్రకటించనున్నారు. ఇప్పటికే భగవత్ మాన్ను పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేజ్రీవాల్ ప్రకటించారు.
2017లో జరిగిన గోవా ఎన్నికల్లో ఎల్విస్ గొమెస్ నేతృత్వంలో ఆప్ బరిలోకి దిగింది. అయితే ఆయన వివిధ కారణాలతో 2020లో పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త సీఎం క్యాడిడెట్తో రంగంలోకి దిగనుంది. కేజ్రీవాల్ ఇప్పటికే గోవాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఢిల్లీ మోడల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
గోవా, ఉత్తరాఖండ్లో ఫిబ్రవరి 14న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్లో కూడా అదే తేదీన పోలింగ్ ఉన్నప్పటికీ అక్కడి పార్టీల విజ్ఞప్తితో కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలను వాయిదా వేసింది. ఇక మణిపూర్లో ఫిబ్రవరి 27న, మార్చి 3న రెండు విడతల్లో, ఉత్తరప్రదేశ్లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడత్లో పోలింగ్ జరగనుంది. ఐదు రాష్ట్రాల్లో మార్చి 10న ఓట్లను లెక్కిస్తారు.