న్యూఢిల్లీ : ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ శుక్రవారం నిర్వహించిన దాడులపై ఆప్ స్పందించింది. సిసోడియా నివాసంలో సీబీఐకి ఏమీ దొరకవని, కేవలం పెన్సిల్స్, జామెట్రీ బాక్సులు మాత్రమే కనిపిస్తాయని ఆప్ పేర్కొంది. అరవింద్ కేజ్రీవాల్పై దర్యాప్తు ఏజెన్సీలు గతంలో దాడులు నిర్వహిస్తే నాలుగు మఫ్లర్లను గుర్తించాయని, ఇక మనీష్ సిసోడియా ఇంట్లో సీబీఐకి ఏమీ పట్టుబడవని, వారికి కేవలం పెన్సిళ్లు, నోట్బుక్స్, జామెట్రీ బాక్సులు దొరుకుతాయని ఆప్ నేత రాఘవ్ చద్దా ఎద్దేవా చేశారు.
100కు పైగా ఆప్ నేతలపై తప్పుడు ఆరోపణలు చేశారని, ఒకరి తర్వాత ఒకరు తమ నేతలందరిపై బూటకపు కేసులు బనాయిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన నూతన మద్యం విధానం నేపధ్యంలో ఢిల్లీ విద్య, ఎక్సైజ్ శాఖ మంత్రి మనీష్ సిసోడియాపై తాజాగా సీబీఐ దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. లైసెన్స్ కలిగిన ప్రైవేట్ వ్యక్తులు మద్యం విక్రయించేందుకు అనుమతిస్తూ ఢిల్లీ ప్రభుత్వం తాజా మద్యం పాలసీని తీసుకువచ్చింది.
కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండానే మద్యం విక్రయాలకు అనుమతించేలా ఈ విధానం రూపొందిందని సీబీఐ ఆరోపిస్తోంది. మరోవైపు అవినీతికి చెక్ పెడుతూ లిక్కర్ మాఫియాకు అడ్డుకట్ట వేసే ఉద్దేశంతోనే ఈ పాలసీని ముందుకు తెచ్చామని సిసోడియా చెబుతున్నారు. దేశ రాజధానిలో సిసోడియా ప్రవేశపెట్టిన మెరుగైన విద్యా విధానంతో దేశ విదేశాల నుంచి ఆయన మోడల్పై ప్రశంసలు వెల్లువెత్తడంతోనే కాషాయ పాలకులు టార్గెట్ చేశారని ఆప్ ఆరోపిస్తోంది.ఇక సిసోడియాపై న్యూయార్క్ టైమ్స్ గురువారం ఓ వ్యాసాన్ని ప్రచురించింది.