అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఆయా పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. గుజరాత్లో గెలుపే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీశ్ సిసోడియా.. మరో హామీ ఇచ్చారు. గుజరాత్లో ఆప్ అధికారంలోకి రాగానే 8 సిటీల్లో ప్రతి 4 కిలోమీటర్ల దూరానికి ఒక స్కూల్ చొప్పున నిర్మిస్తామని ప్రకటించారు. ఈ పనులను ఒక్క ఏడాదిలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
తాను ఎక్కడా ఉన్నా.. గుజరాత్లో స్కూళ్ల నిర్మాణం ఆగదన్నారు. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని, ప్రభుత్వాలను ఎంచుకోవాలని చెప్పారు. గుజరాత్లో 48 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే, అందులో 32 వేల స్కూళ్లు అద్వాన్న స్థితిలో ఉన్నాయని మండిపడ్డారు.
ఆప్ అధికారంలోకి రాగానే అహ్మదాబాద్, సూరత్, వడోదర, జామ్నగర్, రాజ్కోట్, భావ్నగర్, గాంధీనగర్, జూనాఘడ్ సిటీల్లో ప్రతి 4 కిలోమీటర్లకు ఒక స్కూల్ను నిర్మిస్తామని సిసోడియా ప్రకటించారు. ఈ స్కూళ్లన్నీ ప్రయివేటు పాఠశాలలతో పోటీ పడే విధంగా ఉంటాయన్నారు. నాణ్యమైన విద్యను అందించేందుకు ఆప్ ప్రభుత్వం కృషి చేస్తదని ఆయన స్పష్టం చేశారు.