AAP | న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. న్యూఢిల్లీలోని రౌస్ అవెన్యూలో ఏర్పాటుచేసిన పార్టీ కార్యాలయాన్ని జూన్ 15వ తేదీలోగా ఖాళీ చేయాలని ఆప్ను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ‘ఆ స్థలాన్ని ఓ రాజకీయ పార్టీ ఎలా తీసుకుంటుంది? అక్కడ అన్ని రకాల ఆక్రమణల్ని తొలగించాల్సిందే’ అని సీజేఐ డీవై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ ప్రదేశాన్ని ఢిల్లీ హైకోర్టు విస్తరణకు కేటాయించినట్టుగా గుర్తించిన సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు జారీచేసింది. ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాల్సిందిగా ల్యాండ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్కు ఆప్ దరఖాస్తు చేసుకోవాలని కోర్టు సూచించింది. ప్రస్తుతం పార్టీ కార్యాలయం ఏర్పాటుచేసిన స్థలంలో కొనసాగే హక్కు ‘ఆప్’కు లేదని ధర్మాసనం పేర్కొన్నది. ఆప్ భూ ఆక్రమణకు పాల్పడిందని, చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోలేరని స్పష్టం చేసింది.
12 తర్వాత వర్చువల్గా విచారణకు హాజరవుతా!
మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎనిమిదోసారి గైర్హాజరయ్యారు. అయితే విచారణకు తాను సంసిద్ధంగానే ఉన్నానని, మార్చి 12న తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని ఈడీ అధికారులకు రాసిన లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.